Thursday, May 2, 2024

విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ రైలులో స్వచ్ఛతా కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

 ‘14 నిమిషాల’ క్లీనింగ్ కార్యక్రమం విజయవంతం

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖపట్నం సికింద్రాబాద్ – వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వచ్ఛతా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. స్వచ్ఛతాహీ సేవ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ క్రమంలో వందేభారత్ రైలు కోచ్ లను వేగంగా సంపూర్ణంగా 14 నిమిషాలలోనే శుభ్రపరచడం ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు నంబర్ 20834 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ‘14 నిమిషాలలోనే రైలును పూర్తిగా శుభ్రపరచడం అనే అద్భుతం ఛాలెంజ్‌ను చేపట్టారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ వందేవీర్‌లతో ఆయన సంభాషించారు. విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. మెకానికల్, క్లీనింగ్ సిబ్బంది మొత్తం వందే భారత్‌కు చెందిన 16 కోచ్‌లను కేవలం 14 నిమిషాల వ్యవధిలోనే శుభ్రపరిచే పనిని విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సంధర్భంలో అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ భారతీయ రైల్వేలు.. రైలు ప్రయాణీకులకు ఉన్నత శ్రేణి శుభ్రత, సౌకర్యవంతమైన రైలు అనుభవాన్ని అందించడానికి భారతీయ రైల్వే 14 నిమిషాల అద్భుత పథకాన్ని ప్రారంభించిందని తెలియజేశారు. ప్రయాణీకులకు పరిశుభ్రతపై జాతీయ స్థాయి పిలుపు ప్రపంచ స్థాయి సేవలను అందించాలనే మా నిబద్ధతకు ఈ సవాలు ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. 14 నిమిషాల క్లీనింగ్ ఛాలెంజ్ వలన స్టేషన్‌లో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని, ప్రయాణికులకు రైలు ఎక్కేందుకు ఎక్కువ సమయాన్ని ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

‘14 నిమిషాల అద్భుతం’ ఛాలెంజ్ ఒక్కసారి చేసే ప్రక్రియ కాదని, ఇది నిరంతరం నేటి నుండి అన్ని వందే భారత్ రైళ్లలో క్రమం తప్పకుండా నిర్వహిస్తామని జనరల్ మేనేజర్ తెలియజేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని వందే భారత్ రైళ్లలో 100 శాతం కంటే ఎక్కువ సీట్ల సామర్ధ్యాన్ని నమోదు కావడం పట్ల జనరల్ మేనేజర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైలు వినియోగదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని, స్వచ్ఛత, క్లీన్ గ్రీన్ ఇండియాకు కట్టుబడి భారతదేశాన్ని పరిశుభ్ర దేశంగా మార్చడానికి సమిష్టిగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా విశాఖపట్నం -సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు ఉంటాయి. ప్రతి కోచ్‌ను ఖచ్చితంగా శుభ్రం చేయడానికి 16 శుభ్రత బృందాలను కేటాయించారు. ప్రతి బృందంలో ముగ్గురు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం అతి సూక్ష్మంగా నిర్దిష్ట పనిని నిర్వహిస్తుంది. ఈ సిబ్బందికి స్వచ్ఛ్ వందే వీర్స్ అని పేరు పెట్టారు. 14 నిమిషాల నిర్దిష్ట సమయపాలనకు అద్భుతమైన సమన్వయం, ఖచ్చితత్వం సామర్థ్యం అవసరం అవుతుందని దమ రైల్వే వెల్లడించింది. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చే ప్రయాణికులు దిగిన వెనువెంటనే 14 నిమిషాల నిర్దిష్ట సమయం గడియారం టిక్.. టిక్.. తో ప్రారంభం కానుంది. ఆ కొద్ది సమయంలోనే … శుభ్రపరిచే సిబ్బంది పూర్తి సమన్వయముతో యంత్రంలా కలిసి పనిచేసే చర్యలోకి దిగుతున్నారు.

Vande Bharat

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News