Saturday, July 27, 2024

మోడీజీ మీ మాటలు కట్టిపెట్టండి

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీకి మాజీ సిఎం ఫరూక్ గట్టి కౌంటర్

రాజౌరి : ముస్లింలు ఎవరి హక్కులను ఊడలాక్కోరని, ఇతర మతాలను గౌరవించాలని తమకు అల్లా చెప్పారని జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. “ వాళ్లకు ఓటు వేయడమంటే నరకానికి (మరణానంతరం ) వెళ్లడానికి సిద్ధం కావడమే ” అని నిప్పులు చెరిగారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజౌరి జిల్లా థానమండి ఏరియాలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫరూక్ మాట్లాడుతూ , దేశ మనుగడకు మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఒక ముప్పుగా పరిణమించిందని ఆక్షేపించారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టొద్దు . లేదంటే పెనుతుఫానుతో దేశ మనుగడే ప్రమాదంలో పడుతుంది. ప్రజలను విడగొట్టడానికి బదులు దేశ ఐక్యత గురించి మాట్లాడడం మంచిది ” అని ప్రధానికి ఆయన హితవు పలికారు.

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజల ధనాన్ని ఎక్కువ మంది పిల్లలు కనే వాళ్లకు పంచిపెట్టేస్తుందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ముస్లింలు అన్ని మతాలను గౌరవిస్తారని, అల్లా కూడా తమకు అదే చెప్పారని, ఎవరి హక్కులను ముస్లింలు ఊడలాక్కోరని అన్నారు. కాంగ్రెస్ ప్రజల మంగళ సూత్రాలను కూడా ఊడలాక్కుందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుల్వామా వెళ్తూ తన వాహనాన్ని ఆపి, ఒక పేద హిందూ మహిళకు మంగళ సూత్రం ఇస్తానని వాగ్దానం చేశారని, గుర్తు చేశారు. ఇండియా కూటమికి ఎవరైతే వ్యతిరేకులో వారు దేశానికివ్యతిరేకులని వ్యాఖ్యానించారు. అలాంటివారు మరణించాక నరకానికి పోవడం తథ్యమని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News