హైదరాబాద్:ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు 2020 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతూ.. గొప్ప విజయాలు సాధించడంతోపాటు అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ మరింత ముందడుగు వేస్తుందని సిఎం ఆకాంక్షించారు. విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ అద్భుత విజయాలను సాధించిందన్నారు. ఇలా అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అక్షరాస్యతలో మాత్రం వెనుకంజలో ఉండడం ఓ మచ్చగా మిగిలిందన్నారు. గత పాలకులు అందరినీ అక్షరాస్యులను చేయడంలో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఈ దుస్థితిని అధిగమించి.. వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు మనందరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని సిఎం అన్నారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నం చేయాలన్నారు. ప్రజలందరూ ‘ఈచ్ వన్ టీచ్ వన్’ అనే నినాదాన్ని స్వీకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.
CM KCR Wishes 2020 New Year Greetings to State People