Sunday, April 28, 2024

కాంగ్రెస్‌కు వచ్చేది 20 సీట్లే

- Advertisement -
- Advertisement -

ఆ 20 సీట్లతో కాంగ్రెస్ చేసేదేమీ లేదు
ఎలాగూ కాంగ్రెస్ గెలవదు కెసిఆర్
అభివృద్ధి, సంక్షేమంపై చర్చలు జరపండి
అభ్యర్థులు, వారి పార్టీల చరిత్ర తెలుసుకోండి… విజ్ఞతతో ఆలోచించి ఓట్లేయండి
ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను కోరిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ వైరా, మధిర, మహబూబాబాద్ ప్రతినిధి, సూర్యాపేట్ ప్రతినిధి:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేదీ లేదు, సచ్చేదీ లేదని, ఆ పార్టీకి కేవలం 20 సీట్లే వస్తాయని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్ధులున్నారని, మళ్ళా గదే 20 సీట్ల కేపరిమితం అవుతుందని, ఇంకా చెప్పాలంటే 20 కంటే తక్కువే వస్తాయని మధిరలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కెసిఆర్ అన్నారు. “మధిర పర్యటనతో 70 నియోజకవర్గంలో మాట్లాడుతున్నానని, తాను ఇంకా 30 నియోజకవర్గాలు వెళ్ళాల్సి ఉందని, ఆయింత 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోతే ఇంకా కాంగ్రెస్ ఊడ్సుకపోతదని, తాను ఎట్లెట్ల పోతనో అట్ల కాంగ్రెస్ ఊడ్సుకపోతది” అని సిఎం కెసిఆర్ అన్నారు. వైరలో జరిగిన సభలో మాట్లాడిన సీఎం కెసిఆర్ కాంగ్రెస్ రాజ్యంలో కరువు ఉండేదని గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని, పల్లెలు, గ్రామాల పరిస్థితి, పట్టణాల పరిస్థితి అప్పుడు ఎట్లుండే… ఇప్పుడు ఎట్లుండే… ఎన్ని మార్పులు వచ్చినయ్… అవన్నీ మీ కండ్ల ముందే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 లంబాడీ తాండాలుచ ఆదివాసీ గూడెంలు, కోయగూడెంలను గ్రామపంచాయితీలుగా మార్చామన్నారు.

ఒక్క వైరా నియోజకవర్గంలోనే 45 తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చామన్నారు. ఇందిరమ్మరాజ్యం దిక్కుమాలిన రాజ్యం అని సీయం కేసిఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తదంటూ ప్రచారం చేస్తున్నారని, కాని ఇందిరమ్మ రాజ్యంలోనే ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను, రైతులను లాఠీలతో కొట్టించిందని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యంలోనే రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు పెరిగాయని కెసిఆర్ అన్నారు. డబ్బు ఉందని అహంకారంతో తిరుగుతున్న నాయకులను ప్రజలు నమ్మెదని సీయం కేసిఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పరొక్షంగా అన్నారు.

ఇటీవలే హైద్రాబాద్‌లొ డబ్బుల కట్టలు దొరికాయని, ఆ డబ్బులు కంటే మీ అమూల్యమైన ఓట్లుతో వారికి బుద్ది చెప్పాలని అన్నారు.అసెంబ్లీ గేటు తాకనీయనని చెప్పడానికి వాళ్ళేవరని,రానున్న రోజుల్లో ప్రజలే వారికి ఓటు ద్వారా తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర,బండి పార్ధసారధి రెడ్డి,ఎమ్మెల్సీ తాతా మధు,మాంజీ మంత్రి సంభాని చంద్రశేఖర్,వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, వైరా బీఆర్‌ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తులు పాల్గోన్నారు.
యుద్ధం చేసేవారికే కత్తి ఇవ్వండి..
రెడ్యానాయక్‌ను గెలిపిస్తే ఆయన హోదా పెంచుతాం.. మరిపెడ ప్రజాఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్
డోర్నకల్ (మరిపెడ):  “యుద్ధం చేసే వాడి చేతిలోనే కత్తి ఉండాలి.. యుద్దం చేయని వాడికి కత్తి ఇచ్చి ఉపయోగం ఏముంటుంది…అలానే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులనే గెలిపించాలని, లేకుంటే ఉపయోగం ఏముంటుంది” అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. యుద్దం చేసే వాడి చేతికి కత్తి ఇవ్వకుండా, యుద్దం చేయని వాడికి కత్తి ఇచ్చి యుద్దం చేయమంటే కుదురుతుందా… అని సీఎం కెసిఆర్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ డోర్నకల్ బీఆర్‌ఎస్ అభ్యర్ధి, తాజా మాజీ ఎమ్మెల్యే డీ.ఎస్.రెడ్యానాయక్ అద్యక్షత వహించగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెడ్యానాయక్‌ను గెలిపిస్తే ఆయన హోదాను పెంచుతామని కెసిఆర్ హామీ ఇచ్చారు. పించన్లు వెయ్యి నుంచి 2,016 ఇప్పటి ఇచ్చుకున్నాం. తాము అధికారంలోకి రాగానే రూ 3,016 పెంచుతాం..దాన్ని రూ.ఐదు వేల వరకు పెంచుకుంటూ పోతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. డోర్నకల్ చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఇక్కడ నీటికి ఎలాంటి పన్నులు లేవన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తు రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచే పరిస్థితులు కల్పించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి అయితే నాలుగు లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. పండించిన దాన్యాన్ని 7,500 కొనుగోలు కేంద్రాల ద్వారా మీ గ్రామాల్లోనే కొనుగోళ్లు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఇందుకోసం వెయ్యి నుంచి రెండు వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ రైతు ప్రయోజనాలకే తమ ప్రభుత్వానికి ముఖ్యమని భావించామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మాయమాటలు నమ్మి కర్నాటకలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అక్కడ ఐదు గంటల పాటే కరెంటు ఇస్తున్నారని, ఇక్కడ కూడా మూడు గంటలే ఇస్తామని ఇప్పటికే పిసిసి అద్యక్షుడే స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయి గోసపడ వద్దని తెలంగాణ రైతాంగానికి సీఎం సూచించారు. డోర్నకల్ నియోజకవర్గంలోనే 82 తండాలు గ్రామ పంచాయితీలుగా తీర్చిదిద్దుకున్నామని అన్నారు. ప్రతీ తండాల్లో బీటీ, సిసి రోడ్ల సౌకర్యాలు కల్పించిన సీనియర్ నేత రెడ్యానాయక్‌ను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే ఈ సారి ఆయన హోదా పెరుగుతుందని సీఎం కేసీఆర్ ఆశేష జనవాహిని చప్పట్ల నడుమ ప్రకటించారు. ఈ సభలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధన చారి, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్, జడ్పీ చైర్‌పర్సన్ కుమారి అంగోతు బిందు, జిల్లా గ్రంధాలయ చైర్మైన్ గుడిపూడి నవీన్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, సీనియర్ నాయకులు రామ సహాయం రంగారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కుడితి మహేందర్ రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, డీఎస్. రవిచంద్ర, నూకల వేణుగోపాల్ రెడ్డి, ఆయూబ్ పాషా, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ, రాంబాబు, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాయేదో రత్నమేదో మనం గుర్తించాలి: కెసిఆర్
సూర్యాపేట:  ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల నడవడిక తీరు తెన్నులు పార్టీల సిద్ధాంతాలు రైతాంగం గురించి ఆయా పార్టీల అభ్యర్ధుల వైఖరిని పరిశీలించాల్సిన అవసరం ఉందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాయేదో రత్నమేదో గుర్తించాలని, ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని వజ్రాయుధంగా మార్చుకోని తద్వారా తమ తలరాతను తామే మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలకు నీళ్లు రాకుండా ఆపిందే కాంగ్రెస్ వాళ్లన్నారు. బీడుపడ్డ భూములకు నీళ్లు రప్పించి పంటలు పండించాలనుకున్నామని, సంవత్సరంలో పది నెలల పాటు కాలువల నిండా నీరు పారుతున్నాయన్న విషయం తెలిసిందేనని అన్నారు. ఒక నాడు ఎంత పంట పండిందో రైతులకు తెలుసని, నేడు 2లక్షల 15వేల ఎకరాలు సాగుచేస్తున్నామని, ఇదే కాకుండా ప్రాజెక్టుల కింద సాగు భూమల కింద విధించే పన్నులను రద్దు చేయడమే కాకుండా పాత బకాయిలను సైతం మాఫీ చేశామన్నారు. మన ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే పది వేలు ఉన్న రైతు బంధును 16వేలకు పెంచుతామని, జగదీష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మంచి స్థానంలో ఉంచుతా అన్నారు.

మీ బొటను వేలు ద్వారానే భూ లావాదేవీలు జరిపే విధంగా తీర్చిదిద్దిన ధరణిని భూమాతగా మార్చి పలు కాలాలు చేరుస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారని, కానీ భూమేతగా తయారు చేసుకొని రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు కారణమవుతుందన్నారు. తద్వారా జుట్లు జుట్లు ముడేసి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి పరిస్థితికి కుట్రచేస్తున్నారని అన్నారు.

రైతు బీమా, రైతుబంధు, ధాన్యం అమ్మకాలు ధరణి అనుభంధంగానే అమలు చేస్తున్నామని, దీనిని తీసివేస్తే ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు. సాగునీటి కోసం ఈ ప్రాంతంలో ఎర్ర జెండా ఎన్నో ఉద్యమాలు చేసిందని, భీమిరెడ్డి నర్సింహారెడ్డి లాంటి యోధులు నడయాడిన ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలకు ప్రజలు అవకాశం ఇవ్వరని కెసిఆర్ అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తలసరి ఆదాయం ఒక లక్ష ఉండగా నేడు 3లక్షల 18వేలకు చేరి దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం కూడా 1100ల నుంచి 2240 యూనిట్లు పెంచుకున్నామని, మంచి నీటి నల్లా కనెక్షన్ ఒక రూపాయికి అందించి ఇంటింటికి మిషన్ భగీరధ ద్వారా త్రాగు నీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ఉద్యమ సమయంలో సూర్యాపేట, నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రాంతాలు వేలాది ఎకరాలలో ఆముదం పంటలు ఉండేవని, నేడు పచ్చని పొలాలతో కోనసీమగా మారిందని, 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని అన్నారు. రోడ్లపై ధాన్యం రాశులు అనేక చోట్ల చూసి ఆనందపడ్డామన్నారు. ప్రలోభాలకు గురి కాకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎవరో చెప్పిరని ఓటు వేసి బాధపడవద్దని విజ్ఞప్తి చేశారు. దక్షిణ తెలంగాణలో 30వేల కోట్ల తో యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేసుకుంటామని, దాని ద్వారా ఈ ప్రాంత రూపు రేఖలే మారుతాయన్నారు. ఈ సభలో భారాస సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్ధి, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ స్వీకర్ ఎస్.మధుసూదనచారి, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, గోరేటి వెంకన్న, జిడ్పి ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, డాక్టర్ చెరుకు సుధాకర్, ఎలగందుల వెంకటేశ్వర్లు, కాసోజు శంకరమ్మ, బీరవోలు సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News