తిరువనంతపురంః కేరళ బడ్జెట్ పత్రాల ముఖచిత్రంగా నెత్తురోడుతున్న గాంధీజీని పొందుపర్చారు. 1948లో ప్రార్థనా స్థలంలో నాథూరాం గాడ్సే తూటాలకు బలి అయి, కుప్పకూలిన గాంధీని ఈ ముఖచిత్రంగా పెట్టారు. ప్రతి సారి కేరళ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పణ దశలో సంబంధిత పత్రాల సంకలనానికి ప్రత్యేకతల ముఖచిత్రం పెట్టడం ఆనవాయితీ అయింది. ఈసారి చనిపోతున్న గాంధీని కవర్గా ఎంచుకున్నారు. ఆర్థిక మంత్రి టిఎం థామస్ ఇసాక్ శుక్రవారం తైలవర్ణ చిత్రంతో కూడిన ముఖచిత్రపు బడ్జెట్ పత్రాలను సభలో సమర్పించారు. ఈ చిత్రాన్ని ఆర్టిస్టు టామ్ వాట్టాకుజి గీశారు. గుండెల్లోకి తూటాలు దిగడంతో పడిపోయిన గాంధీ చుట్టూ జనం గుమికూడి ఉన్నట్లుగా సజీవ రీతిలో ఈ చిత్రం రూపొందించారు.
ఈ ఏడాది జనవరి 30వ తేదీ గాంధీ వర్థంతి సందర్భంగా కూడా ఇదే చిత్రాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కన్హయ్య కుమార్లో ట్వీట్ చేశారు. అయితే ఈ బొమ్మ ఎవరు గీసిందీ వారు తెలియచేయకపోవడం విమర్శలకు దారితీసింది. అయితే కేరళ ఆర్థిక మంత్రి పద్థతి పాటించి ఈ ఆర్టిస్టు పేరు ఇచ్చి గౌరవం కల్పించారు. గత ఏడాది బడ్జెట్ పత్రాల ముఖచిత్రంగా కేరళ అసెంబ్లీలో పిఎస్ జలజ గీసిన చిత్రం పొందుపర్చారు. సాంఘిక సంస్కర్త అయ్యంకలి దళిత బాలిక పంచమితో కలిసి ఉన్నప్పటి చిత్రం పలువురిని ఆకట్టుకుంది. అయితే వామపక్ష ప్రభుత్వం ఉన్న కేరళ అసెంబ్లీలో ఈసారి గాంధీ చరమాంకపు బొమ్మ వేయడం దిగజారుతున్న దేశ సామాజిక విలువలకు అద్దంపట్టేందుకే అనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Cover Page of Kerala Budget document