హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన హాక్.ఐ యాప్ను ప్యాసింజర్ క్యాబ్ సర్వీసులైన ఓలా, ఊబెర్ తదితర ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల మొబైల్ యాప్లకు అనుసంధానం చేయడం ద్వారా మహిళల భద్రతకు చేపట్టిన విధానానికి ప్రముఖ సంస్థ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర పోలీస్ శాఖకు 2019 ఇ గవర్నెన్స్ ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది. ఎక్సలెన్స్ అవార్డుగా వ్యవహరించే ఈ అవార్డును భువనేశ్వర్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డిజిపి కార్యాలయం ప్రతినిధి ఐటి విభాగం డిఎస్పి కె.వెంకటేశ్వరరెడ్డికి ఒరిస్సా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఐటి క్రీడా శాఖ మంత్రి తుషార్ కాంతిబెహ్రా ప్రదానం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ప్రవేశ పెట్టిన హాక్ ఐ మొబైల్ యాప్ నిర్వహణను సిఎస్ఐ ప్రశంసించింది. సిఎస్ఐ అందజేస్తున్న వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రాజెక్ట్ విభాగం నామినేషన్లో హాక్ఐ మొబైల్ యాప్ను ప్యాసింజర్ క్యాబ్ సర్వీసులకు అనుసంధానం చేసినందుకు గాను ఈ ఎక్సలెన్స్ అవార్డును తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సిఎస్ఐ ప్రకటించింది. రాష్ట్ర పోలీస్ శాఖకు సిఎస్ఐ ఎక్సలెన్స్ అవార్డు రావడం పట్ల డిజిపి మహేందర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసుల పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారడంతో పాటు పలు అవార్డులు దక్కుతున్నాయని, దీంతో పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులు ఆదర్శంగా మారాలని డిజిపి తెలిపారు.