హైదరాబాద్: మనుషుల్లో దైవ చింతన కరువై పోతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. శంషాబాద్లో ప్రసిద్ధ అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవవాలయాన్ని శుక్రవారం గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయాలతో గవర్నర్ తమిళిసైని ఆహ్వానించారు. స్వామివారి దర్శనం అనంతరం పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక సభలో గవర్నర్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశిస్తూ గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ మనుషుల్లో స్వార్థం పెరిగి దైవ చింతన, సనాతన ధర్మాలను మర్చిపోతున్నారని చెప్పారు. ఒకప్పుడు గ్రామాల్లోని దేవాలయాల్లో రామాయణ, మహాభారత పారాయాణాలు జరిగేవని గుర్తు చేశారు. ఒగ్గుకథలు, బుర్రకథలు వినిపించి చరిత్ర, ధార్మిక అంశాలను వివరించేవారన్నారు. అయితే ప్రస్తుతం ఆలయాల్లో ఈ సంప్రదాయాలు తగ్గుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ సాంస్కృతిక సంప్రదాయాలను పాటించాలని గవర్నర్ తమిళిసై కోరారు.