క్యురేటివ్, రివ్యూ పిటిషన్లకు గడువు విధించాలి, వారంలోగా క్షమాభిక్ష తేల్చేలా చూడాలి, డెత్ వారెంట్కు ఏడు రోజులు గడువు ఇవ్వాలి
విధాన లోపాలు దోషులకు వరం కాకూడదు : సుప్రీంకు కేంద్రం అభ్యర్థనలు
సుప్రీంకోర్టుకు కేంద్రం అభ్యర్థన
న్యూఢిల్లీ: మరణశిక్షపడిన నేరస్థులు క్షమాభిక్షకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏడు రోజుల గడువు విధించే విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం బుధవారంనాడు సుప్రీంకోర్టుకు విన్నవించింది. అలాగే అలాంటి కేసుల్లో క్యురేటివ్, రివ్యూ పిటిషన్ల దాఖలుకు కూడా కాలపరిమితి (టైం లిమిట్) విధించవలసిందిగా కోరింది. నిర్భయ కేసులో (2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు) దోషులకు ఉరిశిక్ష అమలులో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విన్నపం చేసింది. శత్రుఘ్న చౌహాన్ కేసులో 2014 నాటి తీర్పులో సవరణ చేయాలని కూడా కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని అర్థించింది. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్వహణాపరమైన లోపాలవల్ల అమలు ఏళ్లతరబడి ఆలస్యమవుతోంది. ఈ నిరీక్షణ నేరస్థులను క్షోభకు గురిచేస్తోంది.
ఈ సందర్భంగా ఉరి అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని మాత్రమే కాక, ప్రభుత్వం రహస్యంగా అమలు జరిపే ఉరిశిక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంది. క్షమాభిక్ష పిటిషన్ల తిరస్కరణకు, ఉరి అమలుకు మధ్య 14 రోజలు మాత్రమే వ్యవధి ఉండాలని సుప్రీంకోర్టు అదివరకు ఆదేశించింది. ‘మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతీకారానికి రాజ్యాంగపరమైన విలువ లేదు’ అని జడ్జీలు ఆదేశించారు. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు ఒక దరఖాస్తు చేసుకుంది. నేరస్థులు నిర్ణీత గడువులోగానే క్యురేటివ్ పిటిషన్ను దాఖలు చేసుకోవాలని, డెత్ వారంట్ జారీ అయిన ఏడు రోజుల్లోగానే క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
అంతేకాక, రాష్ట్రపతి క్షమాభిక్ష దరఖాస్తులను తిరస్కరించిన ఏడురోజుల్లోగా డెత్ వారంట్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు అన్ని కోర్టుల్ని, రాష్ట్రాల ప్రభుత్వాల్ని కూడా ఆదేశించాలని కేంద్రం కోరింది. దోషి దాఖలు చేసే పిటిషన్ స్థాయితో సంబంధం లేకుండా ఇది జరగాలని కూడా కోరింది. దోషుల హక్కుల పట్ల జాగ్రత్త వహించడంతో పాటు బాధితుల్ని, వారి కుటుంబాల్ని, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. నేరస్థులు చట్టంతో ఆడుకుంటూ శిక్ష అమలు ఆలస్యమయ్యేలా ప్రయత్నిస్తున్నారని కేంద్రం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.