వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని
చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి
2002లో కరోనా కాటుకు 650 మంది మృతి
చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక
బీజింగ్: చైనాలోని షెంజెన్లో ఇంటర్నేషనల్ స్కూలులో పనిచేస్తున్న భారతీయ ఉపాధ్యాయిని ప్రీతి మహేశ్వరి(45) సార్స్ వంటి కరోనా వైరస్ సోకి తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఆమెకు స్థానిక ఆస్పత్రిలో వైద్య చికిత్స చేస్తున్నట్టు ఆమె భర్త అషుమన్ ఖోవల్ చెప్పారు. సార్స్ ( సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ) తో ఈ వైరస్కు సంబంధం ఉన్నందున ఇది ప్రాణాంతకంగా మారింది. 200203 లో చైనా, హాంకాంగ్లో దాదాపు 650 మంది ప్రాణాలు కోల్పోయారు. మహేశ్వరి వెంటిలేటర్, ఇతర జీవాధార సహాయంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతోందని ఖోవల్ తెలిపారు. ఖోవల్ ఢిల్లీకి చెందిన వ్యాపారి. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉందని, ఆమె కోలుకోడానికి చాలా కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారని తెలిపారు. యుహాన్, షెంజెన్ నగరాల్లో ఈ వైరస్ వ్యాధి విస్తరించింది. యుహాన్ నగరంలో కొన్ని వారాల క్రితం ఈ వైరస్ బయటపడింది. ఇప్పటికి 62 కేసులు నమోదయ్యాయి. 19 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిస్చార్జి అయ్యారు. మిగతా వారిని ఒంటరిగా ఉంచి చికిత్స చేస్తున్నారు. యుహాన్లో 500 మంది భారతీయ వైద్య విద్యార్థులు చదువుతున్నారు. అయితే శెలవుల కారణంగా వీరంతా స్వదేశానికి వెళ్లారు. యుహాన్లో ఈ వైరస్ వల్ల ఇద్దరు చనిపోవడంతో భారత్ శుక్రవారం చైనాలో ఉండే భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. థాయ్లాండ్, జపాన్లో పర్యటన సంబంధ కేసులు రెండు నమోదయ్యాయి. జ్వరం సోకడం, ఊపిరి తీసుకోవడం కష్టం కావడం ఈ వైరస్ లక్షణాలు. కొంతమంది రోగులు దగ్గుతో బాధపడుతున్నారు. ఈ వైరస్ సోకిందని అనుమానిస్తున్న 763 మందిలో వైద్య పరిశీలనలో ఉన్న 681 మందిని విడుదల చేశారు. యుహాన్ సముద్ర చేపల హోల్సేల్ మార్కెట్ వల్ల ఈ వైరస్ విస్తరిస్తుందని మొదట అనుమానించినా అది కారణం కాదని తేలింది. అయినా ఆ మార్కెట్ను ప్రస్తుతం మూసివేశారు.
Dangerous Corona Virus Spread in China