కోట : మతిస్థిమితం లేని తన 17 ఏళ్ల కూతురిపై అనేకసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేయడమే కాక, హత్యకు పాల్పడిన 45 ఏళ్ల తండ్రికి కోట స్పెషల్ కోర్టు మరణశిక్ష విధించింది. అంతేకాదు రూ.20 వేలు పెనాల్టీ చెల్లించాలని కూడా తీర్పులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రేమ్నారాయణ్ నామ్దేవ్ అందించిన వివరాల ప్రకారం 2015 మే 13న బాలిక ఆమె ఇంటిలో శవమై కనిపించగా ఆమె తండ్రి ఆమె హత్యకు గురైందని నయాపురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి వేర్హౌస్ దగ్గర గార్డుగా పనిచేస్తున్నాడు.
వేర్హౌస్ బయట బాలిక తల్లి తన చిన్న కొడుకు సాయంతో టీకొట్టు నడుపుతోంది. చనిపోయిన సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి అని పరిశీలనలో తేలింది. పోస్ట్మార్టమ్లో బాలిక గర్భం తాలూకు డిఎన్ఎ నమూనాలు సేకరించి గర్భం లోని పిండస్థ పరీక్ష చేయగా నిందితుడు తండ్రే అని తండ్రి వల్లే బాలిక గర్భిణి అయిందని తేలింది. బాలిక తల్లి తన భర్త అనేకసార్లు తన కుమార్తెపై అత్యాచారం చేశాడని పోలీసులకు వెల్లడించింది. పోక్సో కోర్టు వెలువరించిన 36 పేజీల తీర్పులో ఈ నేరం హీనాతిహీనమైనదని, మానవసమాజానికి సిగ్గుచేటని పేర్కొంది.