నిర్భయ దోషుల అంతిమ మొరను తిరస్కరించిన సుప్రీం కోర్టు
ఎనిమిదేళ్ల న్యాయ పోరాట ప్రస్థానానికి ముగింపు
మిగిలింది క్షమాభిక్ష విజ్ఞప్తిపై రాష్ట్రపతి నిర్ణయ ఘట్టమే
ఈ నెల 22 ఉదయం తీహార్ జైలులో నలుగురికీ ఏకకాలంలో శిక్ష అమలుకు రంగం సిద్ధం
రాష్ట్రపతికి ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్
ఈ రోజు నాకో విజయదివస్ : నిర్భయ తల్లి
న్యూఢిలీ: ఉరిశిక్ష నుంచి తప్పించాలని నిర్భయ దోషులిద్ద రు పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. న్యాయమూర్తి ఎన్వి రమణతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం దోషులు వినయ్ శర్మ (26), ముఖేష్ కుమార్ (32) పెట్టుకున్న పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించింది. ఈ కీలక పరిణామంతో ఈ నెల 22వ తేదీన దోషులు నలుగురిని తీహార్ జైలులో ఏకకాలంలో ఉరితీసేందుకు రంగం ఖరారు అయింది. సుప్రీంకోర్టు ధర్మాసన ం విచారణ రహస్యంగా జరిగింది. మరణశిక్ష తీర్పు తరువా త దాని నుంచి తప్పించుకునేందుకు సదరు దోషులకు మిగి లి ఉన్న ఏకైక మార్గం క్యురేటివ్ పిటిషన్. ఈ పిటిషన్లు ఇప్ప టి ఇన్ ఛాంబర్ విచారణలో తిరస్కరణకు గురి కావడంతో దోషుల జీవితకాలం ఇక కేవలం ఏడు రోజులుగానే మిగిలింది. మరణశిక్షలపై స్టే విధించాలనే దరఖాస్తులను కూడా ధర్మాసనం కొట్టివేసింది.
ఈ దోషుల శిక్షలపై పునరాలోచనకు ఎటువంటి సరైన ప్రాతిపదిక లేదని పంచ సభ్య ధర్మాసనం అందరిదీ ఒకే మాటగా తిరస్కరణ నిర్ణయానికి వచ్చింది. ‘క్యురేటివ్ పిటిషన్లు, సంబంధిత పత్రాలను పరిశీలించాం. రూపా అశోక్ హుర్రా/ అ శోక్ హుర్రా, మరొకరి 2002 నాటి కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సంబంధిత విధివిధానాలను ప్రస్తుత కేసు విషయంలో పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నాం’ అని ధర్మాసనం పేర్కొం ది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారీమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్లు సహ సభ్యులుగా ఉన్నారు. దోషులు తమకు చివరి అవకాశం కల్పించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు.
ఉరి బిగుసుకొంటోంది దేశవ్యాప్త సంచలనం సృష్టించిన నిర్భయోదంతంలో దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని ఈ నెల 7వ తేదీన ఢిల్లీ కోర్టు డెత్వారంట్లు జారీ చేసింది. దీనితో ఇన్నేళ్లూ ఊగిసలాటలుగా సాగుతున్న దోషుల ఉరి ప్రక్రియలో చలనం వచ్చింది. 22 వ తేదీ ఉదయం 7 గంటలకు వీరిని ఉరితీయాలని, ఈ మేరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని జైలు అధికారులకు ఆదేశాలు వెలువరించారు. 23 ఏండ్ల పారామెడికల్ విద్యార్థిని ఢిల్లీ వీధులలో 2012 డిసెంబర్ 16వ తేదీ అర్థరాత్రి దాటిన తరువాత దారుణ సామూహిక అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో ఆ తరువాత డిసెంబర్ 29వ తేదీన మృతి చెందింది. నడుస్తున్న బస్సులో అత్యంత పాశవికంగా యువతిపై జరిగిన అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితులపై విచారణ సాగింది. కాలక్రమంలో రామ్సింగ్ అనే నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నిందితులలో ఒకడు బాలుడు కావడంతో బాలల నేరాల న్యాయస్థానం విచారణ జరిపి మూడేళ్ల పాటు రిఫార్మేషన్ హోంలో ఉంచి తరువాత విడుదల చేసింది.
పలు కీలక ఘట్టాలు
2012 డిసెంబర్లో జరిగిన నిర్భయ విషాద ఉదంతానికి సంబంధించి కాలక్రమంలో పలు కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వాటి పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. . 2012 డిసెంబర్ 16 ః 23 ఏళ్ల నర్సు కోర్సు విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు ఒక ప్రైవేటు బస్సులో ఆమె స్నేహితుడి సమక్షంలోనే దాడి జరిపి అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమెను నడుస్తున్న బస్సులో నుంచి కిందకు విసిరేశారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స జరిగింది
డిసెంబర్ 17: ఈ ఉదంతంపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు స్పందించి నిందితులను గుర్తించారు. అరెస్టులు జరిగాయి.
డిసెంబర్ 20: బాధితురాలి స్నేహితుడి సాక్షాన్ని సేకరించారు.
డిసెంబర్ 21: నిందితులలో ఒకరని తేలిన బాలుడిని ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్సు టర్మినల్లో పట్టుకున్నారు.
డిసెంబర్ 23: యువతిపై దారుణానికి నిరసనగా ఢిల్లీ వీధులలో తీవ్రస్థాయిలో నిరసనలు. నిషేధాజ్ఞలను ధిక్కరించిన ప్రజలు. వారిని అదుపుచేసేందుకు యత్నించిన పోలీసు కానిస్టేబుల్ సుభాష్ తోమర్పై దాడి. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిక
డిసెంబర్ 25: విషమించిన బాధితురాలి పరిస్థితి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మృతి
డిసెంబర్ 26: బాధితురాలికి గుండెపోటు రావడంతో, మెరుగైన వైద్యం కోసం సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్కు తరలింపు.
డిసెంబర్ 29: తీవ్రగాయాలు, అంతర్గత శారీరక పరిస్థితి దిగజారడంతో యువతి కన్నుమూత.
2013 జనవరి 3: ఘటనకు సంబంధించి పోలీసుల చార్జీషీట్. ఫాస్ట్ట్రాక్ పరిధిలో వేగవంత విచారణ.
సెప్టెంబర్ 13: నలుగురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పు
2014 మార్చి 13: నిందితులకు మరణశిక్షను సమర్థించిన హైకోర్టు
మార్చి 15: దోషుల మరణశిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు. శిక్షల విధింపుపై తిరిగి విచారణకు నిర్ణయం. బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం
మే 5: దోషులకు విధించిన మరణశిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.
2019 ఫిబ్రవరి: దోషులకు డెత్వారంట్ల జారీకి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లిదండ్రులు.
డిసెంబర్ 18: మరణశిక్ష తీర్పును సమీక్షించాలనే దోషి అక్షయ్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
2020 జనవరి 6: కేసులో ఉన్న ఏకైక సాక్షిపై కూడా కేసు దాఖలు చేయాలని దోషి పవన్ తండ్రి దాఖలు చేసుకున్న పిటిషన్ను తోసిపుచ్చిన ఢిల్లీ కోర్టు
జనవరి 7: దోషులు నలుగురిని 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరితీయాలని పేర్కొంటూ డెత్వారంట్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు.
జనవరి 14: దోషులు వినయ్ శర్మ ముఖేష్ కుమార్ల క్యురేటివ్ పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
క్షమాభిక్షకు రాష్ట్రపతికి ముఖేష్ పిటిషన్
ఉరిశిక్ష నుంచి కాపాడాలని, తనకు క్షమాభిక్ష పెట్టాలని నిర్భయ దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి అభ్యర్థన పంపించారు. ఈ విషయాన్ని మంగళవారం ఇక్కడి తీహార్ జైలు అధికారులు తెలిపారు. క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన తరువాత కొద్ది సేపటికే క్షమాభిక్ష పిటిషన్ దాఖలు అయినట్లు వార్తలు వెలువడ్డాయి. 22నే ఉరిశిక్ష పడనున్న తరుణంలో ముఖేష్ వినతిపై రాష్ట్రపతి స్పందన ఏమిటనేది కీలకంగా మారనుంది.
ఇన్నాళ్లకు నాకో విజయదివస్
నిర్భయ దోషుల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై నిర్భయ తల్లి భావోద్వేగంతో స్పందించారు. ఇన్నాళ్లకు తనకు విజయం దక్కిందని , ఇది తనకు గొప్ప రోజని పేర్కొంటూ నిర్భయ తల్లి ఆశాదేవీ విజయ సూచికగా చేతితో వి సంకేతాన్ని చూపారు. సుప్రీంకోర్టు వెలుపల మంగళవారం ఆమెను పత్రికా విలేకరులు, టీవీ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. పి టిషన్ల తిరస్కరణపై స్పందించాలని కోరారు. తన బిడ్డకు, ఎందరో ఆడబిడ్డలకు సరైన న్యాయం కో సం తాను గత ఏడేళ్లుగా వేచిచూస్తున్నానని, ఇప్పటికీ విజయం దక్కిందని తెలిపారు. ఇది గొప్ప రోజు. అయితే ఆ నలుగురు దోషులూ ఉరికంభం ఎక్కి, వారి ప్రాణాలు గాలిలో కలిసిపొయ్యే ఈ నెల 22వ తేదీ తనకు ఘనమైన రోజు అవుతుందని నిర్భయ తల్లి చెప్పారు.
తన ఏడేళ్ల పోరుతో దక్కుతున్న విజయం స్మరణీయమన్నారు. కూతురికి న్యాయం దిశలో ఇది కీలక మైలురాయి అని చెప్పారు. క్యురేటివ్ పిటిషన్లపై విచారణ జరుగు తూ ఉండటంతో ఆమె మంగళవారం న్యాయస్థానానికి వచ్చారు. దోషులు ఇప్పటికీ ఉరిని తప్పించుకునేందుకు యత్నించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏదో విధంగా ఉరి శిక్షను జాప్య ం చేయించాలనే విఫల యత్నానికి దిగుతున్నారని అన్నారు. వీరి పిటిషన్లు కొట్టివేస్తారని ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. పిటిషన్ల కొట్టివేత తరువాతి క్రమంలో ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.