Saturday, July 27, 2024

ధాన్యం కొనుగోళ్లలో దగా చేస్తే వేటు

- Advertisement -
- Advertisement -

కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు, ట్రేడర్ల
లైసెన్స్‌లు రద్దు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి
బ్లాక్‌లిస్టులో.. సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో అధికారులకు
ఆదేశాలు ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేముందు
ఆరబెట్టాలని అన్నదాతలకు విజ్ఞప్తి మార్కెట్
యార్డుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు
చేయాలని సూచన తప్పుడు ఫిర్యాదులు,
ఉద్దేశపూర్వక కథనాలపై అప్రమత్తం మంచినీటి
సరఫరాలో ఇబ్బందులు రావొద్దు : సిఎం రేవంత్

అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులు అమ్ముకునే ధాన్యా న్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహారించాలని సి ఎం సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధ రకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సుల ను రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సిఎం ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి సిఎం రేవంత్ అధికారులతో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు.

కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, అందుకే ధా న్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకటి రెం డు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని సి ఎం సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల కు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని సిఎం ఆదేశించారు.

కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించా లని సిఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలని రేవంత్ ఆదేశించారు. సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లలో జరుగుతున్న తీరును పరిశీలించాలని సిఎం సూచించారు. తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలని సిఎం సూచించారు. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్‌లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తప్పుడు ఫిర్యాదులు, ఉద్ధేశపూర్వక కథనాలపై అప్రమత్తం
ఎన్నికల సమయం కావటంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్ధేశపూర్వక కథనాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు.

గతేడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటి కంటే భూగర్భ జల మట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సిఎం సూచించారు. ఏ రోజుకారోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారధ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలని సిఎం రేవంత్ సూచించారు.

సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు..
ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిశీలించాలని, అక్కడ సమస్యను పరిష్కరించేలా చర్యలను చేపట్టాలని సిఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, మరింత డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సిఎం అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఇటు సింగూర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సిఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన సిబ్బందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. అకారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహారించాలని సిఎం రేవంత్ సూచించారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహారిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News