Monday, April 29, 2024

అలిశెట్టి కుటుంబానికి సిఎం అండ

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ఆదేశాల మేరకు ఇల్లు కేటాయించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ జియాగౌడలో ఇల్లు కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
తెలంగాణ కవి అలిశెట్టి కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర సర్కార్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు అలిసెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైద్రాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించినట్లు పరిశ్రమలు, ఐటి, పురపాలక పట్టణాభివృద్దిశాఖల మంత్రి కెటిఆర్ తెలిపారు. తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి, తెలంగాణ శ్రీశ్రీగా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి ఈ మేరకు హైద్రాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచినట్లు కెటిఆర్ ప్రకటించారు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లా కు చెందిన అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫర్‌గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసాడని, మనసున్న ప్రతి మనిషిని తన కవిత్వంతో కదిలించినవాడు అలిశెట్టి ప్రభాకర్ అని కెటిఆర్ గుర్తు చేశారు.

నాటి ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి… దారితప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేశారని కీర్తించారు. పేదరికం మీద, మహిళా సమస్యలమీద, పల్లె పట్నం బాధల మీద సమస్త సామాజిక రంగాలలో అసమానతలు, అన్యాయాల మీద తన కవితల బాణాలను గురిపెట్టి కొడుతూ సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల తరఫున బాధ్యత కలిగిన సైనికుడుగా అక్షర పోరాటం చేసిన మహనీయుడు అలిశెట్టి అని మంత్రి కెటిఆర్ కొనియాడారు. సామాజిక బాధ్యతలే తప్ప తన ఇంటి బాధ్యత, తన వంటి బాధ్యత కూడా పట్టకుండా తన జీవితాన్ని కళకే అంకితం చేసిన త్యాగశీలి అలిశెట్టి అని అన్నారు. సమాజం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి తనువు చాలించిన కవి అలిశెట్టి భార్య పిల్లలు కుటుంబం నేడు పేదరికంలో మగ్గుతుండడం, భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అలిశెట్టి కుటుంబానికి సరియైన విధంగా సహాయం అందించే చర్యలు చేపట్టాలని ఆదేశించారని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు తాను తక్షణమే స్పందించి అలిశెట్టి ప్రభాకర్ కు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ఇప్పించేందుకు తన కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలిపారు. కాగా మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు దివంగత అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ పేరుతో హైదరాబాద్ ఆసీఫ్‌నగర్‌లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూంల సముదాయంలో ఒక దానిని కేటాయిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

తమకు డబుల్ బెడ్ రూం కేటాయించినందుకు అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ, కుమారులు సంగ్రామ్, సంకేత్ సహా ఇతర కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు ప్రత్యేక కృతజ్జతలు తెలిపారు. కవిగా తమ తండ్రి త్యాగాలను గుర్తించి తమను కష్టకాలంలో ఆదుకుని తమకో గూడు నిలిపినందుకు సిఎం కెసిఆర్ కు రుణపడి ఉంటామని ఈ మేరకు ‘అలిశెట్టి’ కుమారులు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News