మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల ఖరారుపై టిఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చింది. ఇటీవల డిసిసిబిల నుంచి రాష్ట్ర ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు అభ్యర్థిని ఖారారు చేయాల్సి ఉండగా టిఆర్ఎస్ అధిష్టానం అనేక నివేదికలను పరిశీలించిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ గురువారం అభ్యర్థిని ప్రకటించనుంది. ఇప్పటికే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ డిసిసిబిలు, మంత్రులు, నియోజకవర్గాల నాయకులతో సమావేశమై ఒకనిర్ణయానికి వచ్చినట్లు టిఆర్ఎస్ నాయకులు చెప్పారు. అయితే పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం అనంతరం గురువారం పేరును టిఆర్ఎస్ అధిష్టానం ప్రకటించనుంది. అయితే ముందుగా ప్రకటించకుండా ఎన్నికల సమయానికి కాస్తముందుగా ప్రకటించి ఏకగ్రీవంగా టెస్కాబ్ ఛైర్మన్,వైస్ ఛైర్మన్ ఎంపిక చేయాలని టిఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే జిల్లాలవారిగా డిసిసిబిలతో సమావేశమైన కెటిఆర్ టెస్కాబ్ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానానికి పంపించారు. ఎన్నికైన డిసిసిబి ఛైర్మన్లలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారికే అవకాశాలు వస్తాయని ఇప్పటికే టిఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించింది.