906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం
నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు
జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే మొదటి సారి
2018 ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న ఇన్ఛార్జీల పాలన
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్యాక్స్లకు నియమించిన పర్సన్ ఇన్ చార్జ్ ల పదవీకాలం ముగుస్తున్నందున మూడు, నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించి, ప్యాక్స్లకు కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇంఛార్జీల పాలనకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మున్సిపల్ ఒక్కసారి కూడా సహకార ఎన్నికలు జరగలేదు. 2018లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వరుస ఎన్నికలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం 584 మండలాలకు 906 సహకార సంఘాలున్నాయి. సిఎం ఆదేశాలకు అనుగుణంగా ముందుగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని సహకార శాఖ నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఖచ్చితంగా రెండు ప్యాక్స్లు ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వాటి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు మరింత సమయం పడుతుండటంతో ఉన్నవాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పుడు 81 మండలాల్లో ఒక్క ప్యాక్స్ కూడా లేదు. మరికొన్ని మండలాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ప్రస్తుతమున్న 584లో 272 మండలాల్లో ఒక్కో ప్యాక్స్ మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వీటన్నింటిలో అదనంగా మరొక ప్యాక్స్ ఏర్పాటు చేస్తారు. 81 మండలాల్లోను రెండు చొప్పున మొత్తం 162 ఏర్పాటు చేస్తారు. దీంతో కొత్తగా 434 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు చేసే కసరత్తు కొనసాగుతోంది. కొత్తవి ఏర్పడిన తరువాత వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.