Thursday, April 25, 2024

యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్:  కృషి, పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి వృత్తి నైపుణ్య సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ధ్రువ పత్రాలను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ తరహాలో మహబూబ్ నగర్ జిల్లాలో సైతం సెట్విన్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గడచిన నాలుగు సంవత్సరాలకు ముందు న్యాక్ తరహాలో శిక్షణా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ,సెట్విన్ ద్వారా సుమారు 45 నుండి 50 ట్రెడ్లల్లో శిక్షణ పొందేందుకు అవకాశం ఉందని, ఇప్పటివరకు జిల్లాలో సుమారు 15 బ్యాచులు శిక్షణ పొందాయని, 2000 పైగా అభ్యర్థులు శిక్షణ తీసుకున్నారని తెలిపారు.

శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ఆయా వృత్తులలో వ్యాపారంతో పాటు, ఉద్యోగాలు సైతం చేసుకోవచ్చని తెలిపారు. టైలరింగ్,స్టిచ్చింగ్, ల్యాబ్ టెక్నీషియన్, మొబైల్ రిపేరీ, ఏసి తదితర రంగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని, వీటన్నింటిలో మంచి నైపుణ్యంతో శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలని మంత్రి కోరారు. జిల్లాలో ఇకపై శిక్షణ పొందిన వారందరికీ జిల్లాలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వనున్నామని, ఐటి కారిడార్ లో సుమారు 40000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్టరీలను నెలకొల్పబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాకు పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయని ,అందువల్ల యువత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ట్రేడ్లో శిక్షణ పొందాలని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, రహదారులు, ఆసుపత్రులు, శానిటేషన్ అద్వన్నంగా ఉండేదని, అలాంటిది ఇప్పుడు ప్రతిరోజు మిషన్ భగీరథ తాగునీటితో పాటు అధునాతన ఆసుపత్రులను, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, బైపాస్ రహదారులు, పాఠశాలలు, హాస్టల్లు ,కళాశాలలు, మెడికల్ కాలేజీలు అన్ని కల్పించినట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల నేరుగా ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలే ప్రభుత్వ శిక్షణ పొందుతారని, పట్టుదల, కసితో శిక్షణ పొంది కుటుంబాలకు ఆర్థికంగా సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలో తెలంగాణ అన్నింటిలో ముందు నిలుస్తున్నదని, జిడిపిలో ఎక్కువ భాగం మనమే ఇస్తున్నామని, ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఎక్కువ శాతం వరి ధాన్యాన్ని సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వీటితోపాటు కంటి వెలుగు, కేసీఆర్ కిట్ ,కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ,పెన్షన్లు వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ,జిల్లా ఎస్పీ కే. నరసింహ, డివైస్ ఓ శ్రీనివాసులు ,సెట్మా మేనేజర్ విజయకుమార్, కౌన్సిలర్ ప్రవీణ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News