Tuesday, April 30, 2024

టీచింగ్ హాస్పిటల్ వైద్యుల యుజిసి ఎరియర్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా
ఉత్తర్వులను వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేసిన మంత్రి హరీశ్ రావు
సిఎం కెసిఆర్‌కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యుజిసి ఎరియర్స్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిఒ కాపీలను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధికి సిఎం కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు.. వైద్య సిబ్బందికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ పరిధిలో భారీగా నియామకాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 1,479 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. పిజి డాక్టర్లను డిహెచ్,టివివిపి నుంచి డిఎంఇ వైపు తీసుకున్నామని వివరించారు. ఇలా ఐదేండ్లలో మొత్తం 688 మందిని తీసుకున్నామని చెప్పారు. 761 వైద్యులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 545 వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లుగా, 31 మందికి అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చామన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే కొత్తగా 26 మెడికల్ కాలేజీలు వచ్చాయని, కొత్త పోస్టులు క్రియేట్ అయ్యాయన్నారు. దీంతో త్వరగా ప్రమోషన్లు పొందుతున్నారని చెప్పారు. ఒకప్పుడు 20 ఏండ్ల సర్వీస్ తర్వాత ప్రొఫెసర్ ప్రమోషన్లు వచ్చేవని, ఇప్పుడు 7 ఏండ్ల సర్వీసు నిండిన వెంటనే ప్రొఫెసర్ పదోన్నతి పొందుతున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొందరు అసిస్టెంట్, మరికొందరు అసోసియేట్ ప్రొఫెసర్లుగా రిటైర్డ్ అవుతున్నారని గుర్తు చేశారు. టీచింగ్ ఫ్యాకల్టీ వయస్సు 61 నుంచి 65 ఏళ్లకు పెంచామన్నారు. కొత్తగా క్రియేట్ అయిన ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పని చేస్తున్న ప్రొఫెసర్లకు ముందుగా అవకాశం ఇచ్చి, మిగిలిన పోస్టుల్లో పదోన్నతుల ద్వారా నింపాలని అనుకుంటున్నామని చెప్పారు.

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం: వైద్య సంఘాల ప్రతినిధులు
ఏరియర్స్ విడుదలతో పాటు.. బదిలీల ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వైద్య సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టిటిజిడిఎ) రాష్ట్ర, అధ్యక్ష, కార్యదర్శులు అన్వర్, జలగం తిరుపతి రావు, ఉపాధ్యక్షుడు కిరణ్ మాదాల మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్‌కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించినందుకు తామంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News