Monday, April 29, 2024

మళ్లీ మొదటికి!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌ఆర్‌టిసి బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ బిల్లును న్యాయ శాఖకు పంపించారు. దీంతో పాటు ఇతర బిల్లులను కూడా న్యాయసలహా కోసం పంపించారు. టిఎస్‌ఆర్‌టిసి బిల్లుపై దురుద్ధేశ్యంతో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. బిల్లును న్యాయసలహా కోసం పంపించామని, న్యాయశాఖ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని రాజ్ భవన్ తెలిపింది. టిఎస్‌ఆర్‌టిసి బిల్లుకు వారం రోజులు దాటినా గవర్నర్ తమిళిసై ఆమోదం లభించలేదు. ఈ బిల్లు ద్వారా కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు గవర్నర్ ఇదివరకే చెప్పారు. అయితే వారం గడిచినా గవర్నర్ ఆమోదించకపోవడంతో కార్మిక సంఘాలు గురువారం అల్టిమేటం జారీ చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ నుండి స్పష్టత వచ్చింది. టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఇటీవల శాసనసభ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం విదితమే. ఆర్‌టిసి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించే సమయంలో గవర్నర్ పది సిఫార్సులు చేశారు.

గవర్నర్ సిఫార్సు చేసిన పది అంశాలు ఏంటంటే…!
ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా టిఎస్‌ఆర్‌టిసికి చెందిన భూములు, ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలి. దాని అవసరాలకే వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన మాట (అండర్‌టేకింగ్) ఇవ్వాలి. ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టానికి తగ్గట్టుగా ఆస్తుల విభజన పూర్తి చేయాలి. ఉమ్మడి ఎపిఎస్‌ఆర్‌టిసి నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత తీసుకోవాలి. విలీనం తర్వాత ఆర్‌టిసి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లానే పేస్కేల్స్, సర్వీస్ నిబంధనలు ఉండాలి. వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పిఎఫ్ గ్రాట్యూటీ ఇలా అన్ని సదుపాయాలు కల్పించాలి. తీవ్రమైన ఒత్తిడి, శారీరక సమస్యలు, ఆరోగ్యపరమైన కారణాలను చూపుతూ కార్మికులు విజ్ఞప్తి చేసుకొంటే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశం ఉండాలి. ఆర్‌టిసిలో క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉన్నాయి.

ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లాగానే మానవీయంగా ఉండాలి. ప్రభుత్వంలో విలీనం చేసుకొన్న ఉద్యోగులను వేరే శాఖలకు డిప్యూటేషన్ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు రక్షణ ఉండాలి. పదోన్నతుల్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ప్రయోజనాలు కల్పించాలి, వారి సర్వీసుకు పరిరక్షణ, పిఎఫ్‌తో పాటు అన్ని సాదుపాయాలు కల్పించాలి. రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంతకాలం ఆర్‌టిసి ఆసుపత్రుల్లో సేవలు, ప్రభుత్వ ప్రాయోజిత చికిత్సలు, బీమా ప్రయోజనాలనను నిర్ధిష్టస్థాయి వరకు ఉమ్మడిగా కల్పించాలి, రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలనూ ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేర్చాలి. ఓ స్వతంత్ర సంస్థకు అప్పగించడం లేదా మరేదైనా పద్ధతిలో బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి, ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారాన్ని భరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News