Wednesday, May 1, 2024

19న స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని విఎస్టీ కూడలి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 19న (శనివారం) ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు మంతరి కెటిఆర్ వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో 2.63 కి.మీల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డిపి) కింద జిహెచ్‌ఎంసి నిర్మించిందని తెలిపారు. ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు. నాయిని ముషీరాబాద్ నియోజకవర్గం ఎంఎల్‌ఎగా ప్రాతినిధ్యం వహించారని, అలాగే, చాలా కాలం పాటు వీఎస్టీ కార్మికుల సంఘానికి సారథ్యం వహించారని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు.

2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో వాహనదారుల కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపడుతోంది. సిగ్నల్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ఇప్పటి వరకు సిటీలో 32 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. మామూలుగా లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో 5 జంక్షన్ల ఉంటాయి. ఎవరైన ఆర్టీసీ క్రాస్ రోడ్డు దాటి విద్యానగర్ వైపు వెళ్లాలంటే అరగంట టైం పడుతుంది. ఈ ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి దక్షిణ భారతంలోనే అతిపొడవైన 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మూవీ థియోటర్ల జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్, వీఎస్టీ వరకు ఈ స్టీల్ వంతెన నిర్మించారు.

రెండున్నర ఏళ్లలో నిర్మాణం
2020 జులై 10న ఈ ఫ్లైఓర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండున్నర ఏళ్లలో 4 లైన్ల రోడ్‌తో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించారు. సన్నటి ఐరన్ పిల్లర్లు 81, 426 దూలాలు నిర్మించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోమీటర్ల దూరమైన లోయర్ ట్యాంక్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు.

నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్లపై నుంచి మెట్రో లైన్ ఉంటుంది. కానీ ఇక్కడ మెట్రో లైన్ పైనుంచి వెళ్లేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. సిటీలో మెట్రో లైన్‌పై నుంచి వెళ్తున్న తొలి ఫ్లైఓవర్ గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. కాంక్రీట్ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువై, కానీ తక్కువ టైంలో నిర్మాణాలను పూర్తి చేయొచ్చు. వందేళ్లకు పైగా మన్నిక ఉంటుందట. నగరంలో మరో మైలురాయిగా నిలిచే ప్లై ఓవర్ తమ నియోజకవర్గంలో రావడంపై స్థానిక ఎంఎల్‌ఎ ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News