అహ్మదాబాద్:పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్కార్టు పంపాలంటూ గుజరాత్లోని ఒక ప్రైవేట్ పాఠశాల తన విద్యార్థులను ఆదేశించడం వివాదాస్పదమైంది. బ్లాక్బోర్డులో రాసిన సందేశాన్ని పోస్ట్కార్డులలో రాసుకుని ప్రధాని మోడీకి పంపాలని అహ్మదాబాద్లోని లిటిల్ స్టార్ స్కూలు యాజమాన్యం ఐదు నుంచి 10వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులను ఆదేశించింది. భారత పౌరుడినైన నేను సిఎఎ తీసుకువచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీగారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ చట్టాన్ని నేను, నా కుటుంబం బలపరుస్తున్నాం అని ఆ పోస్ట్కార్డు సందేశంలో రాసి ఉంది. విద్యార్థులు తమ సొంత చిరునామా రాయడంతోపాటు ఈ పోస్ట్కార్డును న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాస చిరునామాకు పంపించాలని యాజమాన్యం ఆదేశించింది. ఈ పోస్ట్కార్డును పంపించని వారికి ఇంటర్నల్ పరీక్షలలో మార్కులు వేయమంటూ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను బెదిరించినట్లు ఒక విద్యార్థి తండ్రి ఆరోపించారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు దీనికి తీవ్ర అభ్యంతరం తెలియచేయడంతో పాఠశాల యాజమాన్యం ప్రధానికి పోస్ట్కార్డులు పంపించే ప్రతిపాదనను విరమించుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పిన యాజమాన్యం ఆ పోస్ట్కార్డులను విద్యార్థులకే వాపసు చేసింది.
Gujarat school apologises to parents