అలప్పుజా (కేరళ) : కేరళ లోని ఒక మసీదు ఆవరణలో అరుదుగా హిందూ వధూవరుల వివాహ కార్యక్రమం ఆదివారం జరిగింది. అలప్పుజాకు సమీపాన చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు లో వధువు అంజుకు, వరుడు శరత్కు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకొంటున్నారు. కేరళ సిఎం పినరయి విజయన్ ఫేస్బుక్ ద్వారా నూతన వధూవరులను అభినందించారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి మతసామరస్య సంఘటనలు ఎన్నో జరిగాయని పేర్కొన్నారు. మతం పేరిట ప్రజలను విడదీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటివి జరగడాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. వధువు నిరుపేద కుటుంబానికి చెందడంతో ఆమె తల్లి మసీదు కమిటీని వివాహానికి సహకరించాలని అర్థించగా వారు అంగీకరించారు. అంతేకాదు వధువుకు పది సవర్ల బంగారం, రెండు లక్షల నగదు బహూకరించడం విశేషం. వెయ్యి మందికి విందు కూడా ఏర్పాటు చేసినట్టు చెరువల్లి జమాత్ కమిటీ కార్యదర్శి నుజుముదీన్ అలుమ్మూటిల్ చెప్పారు.