హైదరాబాద్: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్ పైచేయి సాధించింది. ఇక్కడి రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్లో కేరళ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు సాధించింది. ప్రతికూల వాతావరణం వల్ల తొలి రోజు కేవలం 41 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ గెలిచిన కేరళ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం తప్పని ఆరంభంలోనే తేలి పోయింది. హైదరాబాద్ బౌలర్లు అసాధారణ బౌలింగ్తో చెలరేగి పోయారు. ఫాస్ట్ బౌలర్లు రవికిరణ్, సిరాజ్లు అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను హడలెత్తించారు. ఇటు సిరాజ్, అటు రవికిరణ్ విజృంభించడంతో కేరళ బ్యాట్స్మెన్ ఒకరి వెంట ఒకరూ పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ పొన్నం రాహుల్ (0) ఖాతా తెరవకుండానే రవికిరణ్ బౌలింగ్లో ఔటయ్యాడు.
వన్డౌన్లో వచ్చిన రోహన్ కూడా సున్నాకే వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా రవి ఖాతాలోకే వెళ్లింది. మరో ఓపెనర్ జలజ్ సక్సెనా (10)ను బ్ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన స్టార్ ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా నిరాశ పరిచాడు. 9 పరుగులు మాత్రమే చేసి రవితేజ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో కేరళ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సచిన్ బేబి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. సచిన్ (29) పరుగులు చేశాడు. మరోవైపు వికెట్ కీపర్ విష్ణు (19), సల్మాన్ నజర్ (37) కూడా రాణించడంతో కేరళ స్కోరు 126కి చేరింది. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ రెండు, రవికిరణ్ మూడు వికెట్లు పడగొట్టారు.