హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు మహిళల భద్రత, రోడ్డు భద్రతకు 2020లో ప్రాముఖ్యం ఇస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. అంబర్పేటలో సిఎఆర్ హెడ్క్వార్టర్స్లో శుక్రవారం ఆయన ఆడియో విజువల్ వ్యాన్, కమాండ్ కంట్రోల్ వ్యాన్, జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ప్రజలకు రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు వీటిని ప్రారంభించామని తెలిపారు. గతంలో ఉన్న వ్యాన్కు మరమ్మతులు చేయించామని తెలిపారు. ఆడియో విజువల్ వ్యాన్ రిపేరుకు రూ.15లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు.
ఎల్ఈడి స్క్రీను ద్వారా ప్రజలకు సైబర్ క్రైం గురించి కూడా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నేరాలు తగ్గించేందుకే వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జంక్షన్లు, పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతుందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ వ్యానును పోలీస్ ఐటి అండ్ సి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. విహెచ్ఎఫ్ సెట్స్, సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనితో కమ్యూనికేషన్ మరింతగా మెరుగవుతుందని తెలిపారు. ఏఆర్ సిబ్బంది కోసం రూ. 15లక్షలతో ఏర్పాటు చేసిన జిమ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎల్బి నగర్ డిసిపి సన్ప్రీత్సింగ్, మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి, ఎడిసిపి సలీమా, ఎడిసిపి అడ్మిన్ శిల్పవల్లి, ఎడిసిపి ఎఆర్ శంకర్, షమీర్, ఎసిపి హరినాథ్ పాల్గొన్నారు.