101 దిగుమతులపై నిషేధం
రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు ఆత్మనిర్భర్ భారత్
లక్షం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రక్షణరంగంలో స్వదేశీకి కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా 101 రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు ప్రకటించింది. దేశ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ప్రకటించారు. స్వదేశీ రక్షణ పరిశ్రమను మరింతగా ప్రోత్సహించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నట్లు, ఇందులో ప్రధాన చర్యగా 101 రకాల ఆయుధాలు, సైనిక అవసరాలైన హెలీకాప్టర్లు, రవాణా విమానాలు, సబ్మెరైన్లు, క్రూయిజ్ మిస్సైల్స్ దిగుమతులపై నియంత్రణలు ఉంటాయని ప్రకటించారు. ఇప్పటి ఒప్పందాల అమలు జరుగుతుందని, 2024నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని రక్షణ మంత్రి తమ ట్విట్టర్లో తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాలంలో దేశీయ రక్షణ పరిశ్రమకు దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర కాంట్రాక్టులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
దిగమతుల జాబితాలో నుంచి పలు ఆయుధాలు, ఇతరత్రా సాధనసంపత్తి తొలిగిపోతుందని, ఈ అవసరాలను దేశీయ రక్షణ రంగమే తీరుస్తుందని మంత్రి వివరించారు. రక్షణ మంత్రిత్వశాఖ అన్ని విధాలుగా స్వదేశీ రక్షణ ఉత్పత్తికి సంసిద్ధంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అభిష్టానికి పిలుపునకు అనుగుణంగా ఆత్మనిర్భర భారత్ లేదా స్వయం సమృద్ధి భారత్ దిశలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈ కోణంలో ముందడుగు వేస్తున్నట్లు వివరించారు. విదేశాల నుంచి దిగుమతులపై ఆంక్షల జాబితాలో ఆర్టిలరీ గన్స్, తక్కువ దూరపు సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స, క్రూయిజ్ మిస్సైల్స్, తీర ప్రాంత గస్తీ నౌకలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ ఇతరత్రా అధునాతన రక్షణ సాధనసంపత్తి ఉంటుంది. వీటిని దేశంలోనే ఉత్పత్తి చేసే దిశలో అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు రక్షణ మంత్రి తెలిపారు. త్రివిధ బలగాల అవసరాలకు అనుగుణంగా అన్ని ఆయుధాలు, సాధనాలు సిద్ధం అవుతాయని తెలిపారు. ప్రభుత్వ అధికారిక పత్రాల ప్రకారం రక్షణ ఉత్పత్తుల దిగుమతుల నిషేధ జాబితాలోని వాటిలో 69 వస్తువులు లేదా ఆయుధాలపై నియంత్రణలు 2020 డిసెంబర్ నుంచి అమలులోకి వస్తాయి. తరువాత మిగిలిన వాటిపై నియంత్రణలు 2021 డిసెంబర్ అమలులోకి వస్తాయి. గరిష్టంగా 2024 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విదేశీ దిగుమతులపై ఆంక్షలు అమలు అవుతాయి.
India to ban imports of 101 defense products