ఈ నెలాఖరులోగా ప్రెస్ అకాడమీ భవనాన్ని తిరిగి ప్రారంభిస్తాం
వృత్తి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టుల
కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అర్హులైన జర్నలిస్టులందరికీ( journalist) ఇందిరమ్మ ఇండ్లు (Indiramma indlu) మంజూరు చేస్తామని, ఈ నెలాఖరులోగా ప్రెస్ అకాడమీ భవనాన్ని తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు, అలాగే వృత్తి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టుల( journalist) కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ఆయన తెలిపారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజనికి తెలియజేసే దాంట్లో ఎంతోమంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని తన జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రెస్ అకాడమీ భవనానికి చిన్న చిన్న మరమత్తులు
ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనానికి చిన్న చిన్న మరమత్తులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.1,00,000తో పాటు అయిదు సంవత్సరాల వరకు, నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల కింద 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు 1,000లను గరిష్టంగా ఇద్దరికి అందించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఖాతాలో మొత్తం రూ.8,98,39,000లు ఆర్థికసాయం అందించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.
జర్నలిస్టు వృత్తి అత్యంత కీలకమయ్యింది: ఖమ్మం ఎంపి
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ రెడ్డి మాట్లాడుతూ ఈ సమాజంలో జర్నలిస్టు వృత్తి అత్యంత కీలకమయ్యిందని తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని ఆయన అన్నారు. గడిచిన రెండు రోజులుగా రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఎదురుచూస్తున్న ప్రజలకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని మంత్రి పొంగులేటికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.