Thursday, April 18, 2024

24 గంటలు విద్యుత్తును అందించేది తెలంగాణనే

- Advertisement -
- Advertisement -

చుంచుపల్లి : దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం చుంచుపల్లి మండలం, ఎన్‌కె నగర్‌లోని ఖమ్మవారి కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్ విజయోత్సవంలో ఎంఎల్‌సి సభ్యులు తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ అనుదీప్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్‌లు హాజరయ్యారు.

తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తరువాత విద్యుత్ శాఖలో సాధించిన ప్రగతిపై సీఎం సందేశాన్ని వినిపించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడే వారని, తెలంగాణ వచ్చిన తరువాత అనతి కాలంలో విద్యుత్ సమస్యను అధిగమించి నేడు అన్ని రంగాలకు 24 గం టలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. 45 సంవత్సరాల క్రింద తన ఇంటికి కరెంట్ లేదని గుర్తు చేస్తూ నేడు రాష్ట్రంలోని ప్రతి రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

రాష్ట్ర ఏర్పాటు జరిగిన తదుపరి 4లక్షల67 వేలు ఉన్న విద్యుత్ కనెక్షన్లు నేడు 8లక్షల56వేలకు చేరుకున్నట్లు చెప్పారు. అప్పుడు 33/11 కెవి ఉప విద్యుత్ కేంద్రాలు 2138 మాత్రమే ఉండేవని, నేడు 3200 ఉన్నట్లు చెప్పారు. గతంలో ఇన్వర్టర్లు చార్జ్ చేసుకోవడానికి విద్యుత్ ఉండేది కాదని, నేడు అన్ని రంగాలకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్న దార్శినికుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పారు. 97321 వేల కోట్లు విద్యుత్ రంగానికి కేటాయించామని, అందులో 50 వేల కోట్లు వివిధ రంగాల వారికి సబ్సిడి అందించినట్లు చెప్పారు. 101 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామన్నారు.

ఆనాడు 7,8 ఖండేలు బావి తవ్వినా నీళ్లు పడేవి కావని, నేడు 4,5 ఖండేలకే నీళ్లు పడుతున్నాయని తెలిపారు. ఆనాడులో ఓల్టేజి సమస్యతో ఫీజులు పోయేవని, నేడు అటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. చిన్నతనంలో తన తండ్రితో చేలకు వెళ్లేవాడనని, అనాడు ఉన్న విద్యుత్ సరఫరా పరిస్థితులను వివరించారు. నేటి పరిస్థితులు ఏ సమయంలోనైనా మోటార్లు వేసే పరిస్థితులు వచ్చాయని ఇదంతా సిఎం వల్లే అభివృద్ధి జరిగిందని, నేడు అన్ని వర్గాల ప్రజల మోముల్లో వెలుగులు చూస్తున్నామని చెప్పారు. గత ఏడాది గోదావరి వరదల సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది ఎనలేని సేవలు అందించారని మీ సేవలు ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల కృషితో ప్రగతి సాధించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News