అహ్మదాబాద్ : ఈనెల 28 న కాంగ్రెస్లో తాను, తనతోపాటు జెఎన్యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ చేరనున్నట్టు గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్ఎల్ఎ జిగ్నేష్ కుమార్ శరివారం వెల్లడించారు. రాహుల్ గాంధీ సమక్షంలో తాము పార్టీలో చేరనున్నామని, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. దేశాభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఆశయాలు సిద్ధాంతాల బాటలో ముందుకు వచ్చే విప్లవాత్మక యువతకు తాము స్వాగతం పలుకుతున్నామని హార్దిక్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెవానీ తన చిరకాల మిత్రుడని, ఆయన పార్టీలో చేరడం రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో దోహదపడుతుందని చెప్పారు. గుజరాత్ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి మనీష్ డోషి తన స్పందన తెలియచేస్తూ 2017 ఎన్నికల్లో మెవానీ కాంగ్రెస్ మద్దతుతో ఎమ్ఎల్ఎ అయ్యారని, ఆయన పార్టీలో చేరడం అవినీతి విధానాల బిజెపిపై పోరాటం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.