హైదరాబాద్ : సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై తన ఫోటో పెట్టడానికి ఆర్టిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సిఎం కెసిఆర్ కొట్టిపారేశారు. ఈ ప్రయత్నాలను ఆయన తప్పు పట్టారు. ఆర్టిసి బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందిండచం, ఆర్టిసి లాభాల్లో పయనించడమే తన లక్ష్యమన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప, దాంతో చౌకబారు ప్రచారం పొందడం తమ అభిమతం కాదని అధికారులకు సిఎం స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్ రెడ్డి ఆర్టిసి ఎండికి మంగళవారం నోట్ పంపారు. కార్గో బస్సులపై ముఖ్యమంత్రి ఫోటో వేయరాదని అందులో ఆయన స్పష్టంగా సూచించారు.