న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. ఢిల్లీ ప్రజలకు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన తాగునీరు, 24 గంటల కరెంట్ ను అందిస్తామని ఆప్ నేత, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. మంగళవారం మనీష్ సిసోడియా 28 పాయింట్ల హామీ కార్డుగా ఆప్ పార్టీ మేనిఫోస్టోను విడుదల చేశారు. ప్రతి సామాన్యుడు గౌరవంగా, సౌభాగ్యంగా జీవించడమే ఆప్ పార్టీ విజన్ అని ఆయన అన్నారు. ప్రజలకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ, 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్ర, విధుల్లో మరణించిన పారిశుధ్య కార్మికుల కుంటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని మనీష్ సిసోడియా హామీ ఇచ్చారు. అలాగే నాణ్యమైన విద్య అందిస్తామని.. ఇందులో భాగంగా స్కూళ్లల్లో దేశభక్తి పాఠ్యాంశాలను చేర్చుతామని, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. మార్కెట్లు 24 గంటలు తెరిచేవిధంగా పైలట్ ప్రాజెక్టును నడుపుతామని ఆయన పేర్కొన్నారు.
AAP releases manifesto with plan doorstep ration promises