Saturday, April 27, 2024

ఈచ్ వన్… టీచ్ వన్

- Advertisement -
- Advertisement -

 New Year wishes

 

విద్యావంతుల్లో ప్రతిఒక్కరూ మరొకరిని అక్షరాస్యులను చేయాలి

రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మారుద్దాం
రాష్ట్రప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2020 నూతన సంవత్సర దిశానిర్దేశం

ఆరేళ్లలోనే అగ్రగామిగా తెలంగాణ
సాధించిన విజయాల స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరింత ముందుకు
విద్యుత్ రంగంలో వెలుగుల వెల్లువ
భగీరథతో మంచి నీటి సమస్యకు తెర
సాగునీటి రంగంలో అసాధారణ విజయాలు
పాలమూరులో పదిలక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగాం, జూన్ నాటికి నూటికి నూరు శాతం కాళేశ్వరం ఫలితాలు

హైదరాబాద్ : 2020 నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు. సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని సిఎం ఆకాంక్షించారు. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రతిన తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈచ్ వన్….టీచ్ వన్అనే నినాదం అందుకుని ప్రతీ ఒక్క చదువుకున్న విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని సిఎం కోరారు.

తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళుతూ గొప్ప విజయాలు సాధించిందన్నారు. అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి, అనేక మంది ప్రశంసలను అందుకుంటున్నదన్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకున్నదన్నారు. అనతికాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదన్నారు. అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుందన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినప్పటికీ ఏమాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే శక్తిని తెలంగాణ రాష్ట్రం సంతరించుకున్నదన్నారు విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని సిఎం కెసిఆర్ వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొట్ట తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ లాంటి పథకం తీసుకురావడానికి మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇది కూడా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తున్నదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని, పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకోగలిగామన్నారు. ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. రాబోయే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వందకు వంద శాతం అందుతాయి, రాష్ట్రం సుభిక్షం అవుతుందన్నారు తెలంగాణ నేల నుంచి కరువును శాశ్వతంగా పారద్రోలగలగడం సాధ్యమవుతుంది. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవనభద్రత కల్పించుకోగలిగామన్నారు. పారిశ్రామిక, ఐటి రంగాల్లో దూసుకుపోతున్నాం” అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

“అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో వెనుక వరుసలో ఉండడం ఓ మచ్చగా మిగిలిందన్నారు. గత పాలకులు అందరినీ అక్షరాస్యులను చేయడంలో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ దుస్థితిని తెలంగాణ రాష్ట్రం అధిగమించి తీరాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు మనందరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్నభరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించామన్నారు.

ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగామన్నారు. అదే విధమైన స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రదిష్టను రూపుమాపాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా భాసిల్లాలి” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

KCR said New Year wishes to state people
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News