న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ మంగళవారం ఆరు గంటల సేపు నిరీక్షించిన తరువాత తన నామినేషన్ దాఖలు చేయగలిగారు. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్ క్యూలో 45వ వ్యక్తిగా నిలుచోవలసి వచ్చింది. ఈ నియోజక వర్గం నుంచి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షీలాదీక్షిత్ను ఓడించి కేజ్రీవాల్ అఖండ విజయం సాధించారు. ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి జామ్నగర్ హౌస్కు వెళ్లినప్పుడు నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు కావడంతో ఇండిపెండెంట్ అ భ్యర్థులు దాదాపు 50 మంది వరకు ఉన్నారు. నిన్నటి రోజున నామినేషన్ వేద్దామని అనుకున్నా రోడ్షోలు వల్ల ఆలస్యమైంది. ఆయనకు క్యూలో టోకెన్ నెంబరు 45 వచ్చింది. నామినేషన్ల దాఖలుకు చాలామంది అభ్యర్థులు రావడంపై కేజ్రీవాల్ అనేక మంది ప్రజాస్వామ్యంలో పాల్గొంటున్నారని సంతోషించారు. కేజ్రీవాల్ను క్యూలో రానివ్వబోం అని ఒక ఇండిపెండెంట్ వ్యాఖ్యానించారు. మాతోపాటు ఆయన క్యూలో నిలుచోవలసిం దే తప్ప మరే అవకాశం లేదని మరో అభ్యర్థి వ్యాఖ్యానించారు. అన్నాహజారే ఉద్యమంలో కేజ్రీవాల్ తమను మోసం చేశారని ఒకరు ఆరోపించారు.