Sunday, April 28, 2024

సిఎం గారూ.. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు?

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో కూడా రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎఐసిసి నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీ పర్యటనల కంటే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ’ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?’ అని నిలదీశారు. ఈ ప్రభుత్వం నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని… నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?

సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్న దాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..?? ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ?? పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా? అని దుయ్యబట్టారు. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఎద్దేవా చేశారు. ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా సాగునీరు ఇవ్వడం చేత కాలేదని మండిపడ్డా రు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అని ప్రశ్నించారు. గుర్తు పెట్టుకోండి..!! ఎద్దేడ్చిన ఎవుసం రైతేడ్చిన ‘రాజ్యం బాగుండద..’అని హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత ‘రైతు’ సమితి పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. జై కిసాన్… జై తెలంగాణ అని ముగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News