మెట్రో కారిడార్-2కు లైన్ క్లియర్
భద్రతా పత్రం జారీ
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు తనిఖీలు
హైదరాబాద్ : హైదరాబాద్ మె ట్రో రైలు జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్కు భద్రతా ధృవీకరణ పత్రాన్ని మెట్రోరైలు ఎండి ఎన్విఎస్ రెడ్డికి మెట్రోరైలు సేఫ్టీ కమిషనర్ జెకె గార్గ్ అందజేశారు. మెట్రో కారిడార్ 2 మార్గమైన జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు ఉన్న మార్గాన్ని గత 3 రోజులుగా సీనియర్ ఇంజనీర్లు, ఎల్ ఆండ్ టిఎంఆర్ఎల్, హెచ్ఎంఆర్ఎల్, స్వతంత్ర లూయి స్ బెర్గర్ , సాంకేతిక నిపుణులతో కలిసి తనిఖీలు నిర్వహించిన సేఫ్టీ కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ చేత 25 కెవి ఓవర్హెడ్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్, ఇతర విద్యుత్ అమలు, భద్రతా ధృవీకరణను పరిశీలించారు.
మెట్రో కారిడార్ 2లోని 9 స్టేషన్లు, ఫైర్ క్ల్రియరెన్స్ డిజి, ఫైర్ సర్వీసెస్, సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థలను పరిశీలించారు. ట్రయల్ రన్లో భాగంగా ఇందులో థేల్స్, కెనడాలకు చెందిన నిపుణులు పలు ప్రాంతాల్లోని భద్రతా ఏర్పాట్లు తనిఖీలు చేశారు. ముఖ్యంగా వయాడక్ట్ ట్రాక్, సిగ్నలింగ్, సమాచార వ్యవస్థ, రైళ్ళు, విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సంబంధించిన అన్ని భద్రతా పరీక్షలను, రైలు ప్రయాణం వంటివి తనిఖీలు చేశారు. స్టేషన్ల నిర్మాణం, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, రాకపోకల ద్వారాలు, టికెటింగ్ వ్యవస్థ, నియంత్రణ గదులు, ప్రయాణికులకు ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. బోయిగూడ మెట్రో రోడ్డు ఓవర్ బ్రిడ్జి, బేరింగులు, ట్రాక్ కొలతలను, రైలు వేగ ప్రమాణాలను పరిశీలించారు.
11కి.మీ.లు.. 9 స్టేషన్లు
సిఎంఆర్ఎస్ జారీచేసిన భద్రతా ధృవీకరణ పత్రంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేస్ 1 చివరి కారిడార్లో ప్రయాణికుల సేవలను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు 11 కి.మీ.లు పొడవులో 9 స్టేషన్లున్నాయి. ఈ కారిడార్లో ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టిసి క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్బజార్, ఎంజిబిఎస్లు ఉన్నాయి. అయితే, భద్రతా ధృవీకరణ పత్రం జారీతో త్వరలోనే ఈ మార్గంలో రైలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్అండ్టి ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిబి రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎకె సని, ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపి నాయుడు, లూయిస్ బెర్గర్, కృష్ణస్వామి, ఆనంద్ మోహన్ లు పాల్గొన్నారు.