సక్రమంగా ఉన్నవి : 25,336
అభ్యర్థులు : 19,673
67 మున్సిపాలిటీల్లో అన్నీ సరైనవే
టిఆర్ఎస్ : 8956, కాంగ్రెస్ : 5365, బిజెపి : 4179 అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్కు 1042 నామినేషన్లు దాఖలు, అభ్యర్థులు : 696 మంది
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 3052 వార్డులకు 19,673 మంది సరైన నామినేషన్లు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దాఖలైన 25,768 నామినేషన్లకు గాను 432 తిరస్కరణకు గురి కాగా 25,336 నామినేషన్లు నిబంధనల మేరకు ఉన్నట్టు ఆదివారం తెలిపింది. 67 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురికాకపోవడం గమనార్హం. సరైన నామినేషన్లు వచ్చిన వాటిలో అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి అధికంగా 8956, కాంగ్రెస్ నుంచి 5365, బిజెపి నుంచి 4179 నామినేషన్లు అందాయి. సిఐఐ(ఎం) నుంచి 268, సిపిఐ 269, టిడిపి 433, ఎంఐఎం 441, ఎన్సిపి నుంచి 36, బిఎస్పి 6, వైఎస్ఆర్సిపి నుంచి నలుగురు నామినేషన్లు వేశారు.
గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల నుంచి 385, రిజిస్టర్డ్ పార్టీల నుంచి 99, ఇండిపెండెంట్ల నుంచి 4889 స్వీకరించారు. తిరస్కరణకు గురైన వాటిపై అప్పీళ్లను అధికారులు స్వీకరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు వీటిని పరిష్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువు ఉంది. బి ఫారాలు, ఉపసంహరణ తరువాత ఏయే పార్టీ తరపున ఎంత మంది బరిలో ఉన్నారో తేలుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జనవరి 22న పోలింగ్, 24న రీపోలింగ్ (అవసరమైతే), 25న ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల ప్రకటన ఉన్న సంగతి తెలిసిందే.
నిజామాబాద్లో 1042 నామినేషన్లు
60 వార్డులున్న నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 696 మంది బరిలో నిలిచారు. ఈ స్థానంలో 1042 నామినేషన్లను అభ్యర్థులు సమర్పించగా 20 తిరస్కరణకు గురికాగా 1042 మిగిలాయి. మిగిలిన అభ్యర్థుల్లో బిజెపి నుంచి ఎక్కువగా 259 మంది, టిఆర్ఎస్ 214, కాంగ్రెస్ 147 సమర్పించాయి. ఆ తరువాత రామగుండం కార్పొరేషన్కు 785 నామినేషన్లు సరైనవి వచ్చాయి. ఇదిలా ఉండగా 26 వార్డులున్న పీర్జాదీగూడలో అతి తక్కువగా 7 నామినేషన్లు మాత్రమే సమర్పించగా ఆ ఏడు నిబంధనల ప్రకారం ఉన్నాయనీ అధికారులు తెలిపారు. వీటిలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, ఎంఐఎం పార్టీలు ఒక్కొటి చొప్పున వేయగా, ఇద్దరు ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.
కార్పొరేషన్లలో 66 తిరస్కరణ
తొమ్మిది కార్పొరేషన్లలో 325 వార్డులకుగాను తిరస్కరణ తర్వాత 2471 మంది మిగిలారు. వీరిలో టిఆర్ఎస్ నుంచి అత్యధికంగా 945 మంది ఉండగా, కాంగ్రెస్ 517, బిజెపి 656, ఎంఐఎం 78, సిపిఐ 30, సిపిఎం 8 మంది ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మున్సిపాలిటీల్లో 366 తిరస్కరణ కు గురైన తరువాత టిఆర్ఎస్ నుంచి 8011, కాంగ్రెస్ 4848, బిజెపి 3523, ఎంఐఎం 363, సిపిఎం 260, సిపిఐ నుంచి 239 మంది మిగిలారు.
9 కార్పొరేషన్లలో వార్డులు, సరైన నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్య ఇలా ఉంది
కార్పొరేషన్ వార్డులు అభ్యర్థులు సరైన నామినేషన్లు
బోడుప్పల్ 13 205 208
బడంగ్పేట 32 158 281
బండ్లగూడ 22 147 183
జవహర్ నగర్ 28 229 229
మీర్పేట్ 46 235 308
నిజామాబాద్ 60 696 1042
నిజాంపేట 33 273 273
రామగుండం 50 501 785
ఫీర్జాదిగూడ 26 07 07