Tuesday, April 30, 2024

2040 నాటికి రొమ్ము క్యాన్సర్‌తో మిలియన్ మరణాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద అత్యంత సాధారణ వ్యాధిలా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్ కారణంగా 2040 నాటికి మిలియన్ (10 లక్షలు) మరణాలు సంభవిస్తాయని ల్యాన్సెట్ కమిషన్ కొత్త అధ్యయనం వెల్లడించింది. 2020 వరకు గత ఐదేళ్లలో 7.8 మిలియన్ మహిళలు రొమ్ము క్యాన్సర్ బాధితులుగా గుర్తింపు కాగా, అదే సంవత్సరంలో 6,85,000 మంది రొమ్ముక్యాన్సర్ బాధితులైన మహిళలు మృతి చెందారని నివేదిక పేర్కొంది.

2020లో ప్రపంచం మొత్తం మీద మహిళల్లో 75 ఏళ్ల వయసుకు ముందే సరాసరిన 12 మందిలో ఒకరు రొమ్ముక్యాన్సర్ బాధితులుగా గుర్తింపు కాగా, ఈ పరిస్థితి మరింత పెరుగుతోందని పరిశోధకులు తెలుసుకున్నారు. 2020లో 2.3 మిలియన్ మంది రొమ్ము క్యాన్సర్ రోగులుండగా, 2040 నాటికి తక్కువ ఆదాయం, మధ్యస్థ ఆదాయం దేశాలన్న తేడా లేకుండా 3 మిలియన్ కన్నా ఎక్కువ మంది వరకు పెరుగుతారని పరిశోధకులు అంచనా వేశారు.

2040 నాటికి ఏడాదికి మిలియన్ మంది ఈ వ్యాధితో చనిపోతారని హెచ్చరించారు. ఇదికాక మెటాలిస్టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలు కూడా అసంఖ్యాకంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒక చోట నుంచి శరీరం లోని ఇతర భాగాలకు వ్యాపించే క్యాన్సర్‌ను మెటాలిస్టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. ఇటీవల కాలంలో ఆధునిక వైద్య ప్రక్రియల కారణంగా చాలావరకు రోగులు బతకగలుగుతున్నారని కమిషన్‌కు నాయకత్వం వహించిన , బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన పరిశోధకులు చర్లోట్టె కోలెస్ వివరించారు. అత్యధిక ఆదాయ దేశాల్లో 40 శాతం వరకు ఈ మరణాలు తగ్గాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News