వరంగల్ : పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతు అవతారమెత్తారు. తన స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో రబీ సాగు పనులు కొనసాగుతున్నాయి. తన కొడుకు ప్రేమ్చందర్రావుతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. ట్రాక్టర్తో పొలం మళ్లను దమ్ము చేయడానికి సిద్ధంగా ఉండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ట్రాక్టర్ ఎక్కి సొంతంగా డ్రైవ్ చేస్తూ పొలం మడులను దమ్ము చేశాడు. అనంతరం తన కొడుకు ప్రేమ్చందర్రావుతో కలిసి వ్యవసాయ కూలీలతో వరినాట్లు వేశాడు. మంత్రి అక్కడితో ఆగకుండా ఎస్సారెస్పి కాలువ నీరు పొలం కాలువలోకి వస్తున్నాయా.. లేదా కాలువలోకి వచ్చే ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అంటూ స్వయంగా కాలువ గట్ల వెంబడి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు.
కొడుకు ప్రేమ్చందర్రావుకు వ్యవసాయ పనితీరు, పంటల విధానం, రైతు జీవన స్థితిగతులపై క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా వివరించారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి జనగాం, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. తన తండ్రి జగన్నాథరావు రైతుగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారని, అక్కడి నుంచే తన జీవితం కూడా ప్రారంభమైందన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచే తాము రాజకీయరంగంలోకి వచ్చామని, వ్యవసాయం లేనిదే తాము లేమన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో పంటల సాగు దిగుబడి తక్కువగా ఉండేదని , కెసిఆర్ సిఎం అయిన తరువాత ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. కల్తీ ఆహారాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన చెప్పారు.