ఎస్విబిసి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృథ్వీ రాజ్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై పెద్ద దుమారం రేగడంతో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని వైసిపి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీరియస్ అయ్యిన ముఖ్యమంత్రి జగన్, పృథ్వీ రాజ్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను గౌరవిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పృథ్వీ రాజ్ ప్రకటించారు. మరోవైపు టిటిడి ఈ ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పటికే విచారణకు ఆదేశించింది.
కాగా, ఇటీవల రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోపాటు ఎస్విబిసి ఛానెల్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో ఆసభ్యంగా ప్రవర్తించినట్లు ఆడియో బయటికి రావడంతో పృథ్వీ వివాదాలపాలయ్యాడు. మహిళ ఉద్యోగితో ఫోన్ లో.. ”పడుకునేటప్పుడు నీకు నేను గుర్తుకు రాలేదా?, మద్యం తాగడం మొదలుపెడితే.. నీ దగ్గర కూర్చొని మొదలుపెడతానని, వెనుక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకుందామని అనుకున్నానని, కానీ కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయాను” అని పృథ్వీ మాట్లాడినట్లు ఓ ఆడియో టేపు బయటకొచ్చింది. తర్వాత ఆ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో..ఎస్విబిసి ఛైర్మన్ పదవి నుంచి పృథ్వీని తప్పించాలని భక్తులు, మహిళా సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడలేదని, కావాలని ఎవరో తన వాయిస్ లా మిమిక్రీ చేశారని పృథ్వీరాజ్ ఆరోపిస్తున్నాడు.
Prithviraj Resigned to TTD SVBC Chairman Post