మనతెలంగాణ/హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్వంతంగా కారు డ్రైవింగ్ చేస్తుండగా లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరగినట్లు పోలీసు విచారణలో తేలింది. షాహేదా సాజిద్ నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన సంభవించింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొనడంతో పోలీసులు అదిశగా దర్యాప్తు చేపడుతున్నారు.
ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు. ఇదిలావుండగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్కు చెందిన బెస్త కిష్టయ్య, జోడు ఆంజనేయులుల జంట హత్య కేసుల్లో షాహేదా సాజిద్ నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు నయీమ్ చేసిన పలు హత్యల్లోనూ ఆమె నిందితురాలిగా విచారణను ఎదుర్కొంటున్నారు. అలాగే గ్యాంగ్స్టర్ నయీమ్ పై నమోదైన అనేక కేసుల్లో సహ నిందితునిగా ఉన్న ఫహీం భార్య షాహేదా సాజిద్ మృతిపై పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపడుతున్నారు. ఈక్రమంలో లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Gangster Nayeem Daughter in law died in road accident