Friday, April 26, 2024

‘బలగం’ మొగిలయ్యకు మంత్రి హరీష్ అండ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘బలగం’ మొగిలయ్యకు మంత్రి హరీష్‌రావు పూర్తిస్థాయి భరోసా నిచ్చారు. తెలంగాణ సాంప్రదాయాలకు సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన ’బలగం’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. చనిపోయిన తర్వాత కాకిముట్టుడు అనే చిన్న లైన్‌ను సినిమా కథగా తీసుకుని అచ్చ తెలంగాణ పల్లె సంస్కృతిని చూపించారు. నిజజీవితానికి దగ్గరగా వుండే ఈ సినిమా కొందరు కళాకారులను వెలుగులోకి తెచ్చింది. అలాంటి వారిలో పస్తం మొగిలయ్య ఒకరు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు బలగం సినిమాలో భార్యతో కలిసి కనిపిస్తాడు. తోబుట్టువులు ఎలా వుండాలో చెబుతూ ఈ దంపతులు పాడిన పాట ప్రతిఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది. కేవలం మొగిలయ్య పాటే కాదు నిజజీవితంలో ఆయన పరిస్థితి కూడా కన్నీరు పెట్టేలా వుంది. రెండు కిడ్నీలు పాడయిపోయి, వైద్యం చేయించుకోడానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నాడు.

అతడి పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. మొగిలయ్య కుటుంబ సభ్యుల కోరిక మేరకు కావాల్సిన మందులు అందించేలా ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి హరీష్ ఆదేశించారు. కిడ్నీలు పాడయిపోయిన అతడికి సమయానికి డయాలసిస్ సేవలు అందేలా చూడాలని సూచించారు. అంతేకాదు ఇప్పటికే మొగిలయ్య ఆరోగ్యం దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తి హెల్త్ చెకప్ కూడా చేయించాలని ఆదేశించారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకుని వెళ్లి పరీక్షలు చేసాక తిరిగి అంబులెన్స్ లోనే ఇంటికి చేర్చాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మొగిలయ్యకు అండగా నిలిచి మంత్రి హరీష్‌కు ఆయన కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తరపున ఇంటి నిర్మాణానికి మంత్రి కెటిఆర్ గ్రీన్ సిగ్నల్…

కిడ్నీలు ఫెయిలైన ‘బలగం’ సింగర్ మొగిలయ్యకు ఉచిత వైద్యం. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డికి మంత్రి కెటిఆర్ ఫోన్ చేశారు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం తరపున ఇంటి నిర్మాణానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చికిత్స పూర్తయ్యేవరకు వైద్య ఖర్చులకు ఎన్ని లక్షలైన సరే లైన్‌ఆప్ క్రెడిట్ చెక్ (ఎల్‌ఓసీ) ద్వారా అందజేస్తామని ఎల్‌ఓసీ ప్రొసీజర్ వెంటనే ప్రారంభించి ఒకటి/రెండు రోజుల్లో వైద్యం కొరకు మొగిలయ్యను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు తరలించనున్నట్లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ బాధ్యతను స్థానిక నాయకులు రైతు సమన్వయ సమితి బాధ్యులు తోకల నరసింహారెడ్డికి అప్పగించారు. మొగిలయ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన త్వరలోనే కోలుకుంటారని ఎంఎల్‌ఎ అన్నారు. తన కళ ద్వారా తెలంగాణ సంస్కృతికి జీవంపోసి అనేక మందిని అలరించాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇక ఇప్పటికే మొగిలయ్యను వెలుగులోకి తీసుకువచ్చిన బలగం డైరెక్టర్ వేణు ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి ఆర్థిక సాయం కూడా చేసారు. బలగం విడుదల తర్వాత మొగిలయ్య దంపతులను కలిసి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News