Sunday, April 28, 2024

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేయాలి: కేంద్ర ఎన్నికల కమిషనర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల్లో ధన బలాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల్లో హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, ధన బలాన్ని కట్టడి చేయాలని పరిశీలకులకు నిర్దేశించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆయా రాష్ట్రాలకు చెందిన 1180 మంది ఎన్నికల పరిశీలకులతో సమావేశమైంది.

పోలీసులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఎన్నికల సాధారణ విభాగాల పరిశీలకులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్ సమర్ధంగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనబలం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహంపై అవగాహన కల్పించారు. ఎన్నికల పరిశీలకులు నిక్కచ్చిగా పని చేయాలని తటస్థంగా, నైతికంగా ఉండాలని వారికి సూచించింది. వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, గిరిజన సమూహాలకు ఓటింగ్‌కు సులభతరం చేయాలని వారికి ఎన్నికల గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని ఆదేశించింది. పరిశీలకులు ఎన్నికల సంఘానికి కళ్లు, చెవుల లాంటివారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచనలు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News