Tuesday, April 30, 2024

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

బయటపడుతున్న నోట్ల కట్టలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృ తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగరలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రూ. రెండు కోట్ల లెక్క చూపని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మియాపూర్‌లోని మంజీరా రోడ్‌లో ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఎలాంటి సంబంధిత రశీదు లేకుండా తరలిస్తుండటంతో 17 కిలోల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం మియాపూర్ చౌరస్తాలో జరిపిన తనిఖీల్లో రూ. 14 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.

గాంధీ నగర్‌లో 2.9 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, వనస్థలీపురంలో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న రూ. 29.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిర్వహించిన తనిఖీల్లో రూ. 32 లక్షలు, గచ్చిబౌలిలో రూ. 10 లక్షలు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా ఈ సొమ్మును తరలి స్తున్నారని పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

148 చెక్ పోస్టులు ఏర్పాటు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా బంగారం, వెండి, డబ్బు తరలిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర శాఖల సమన్వయంతో భారీగా అక్రమ నగదు పట్టుబడుతోంది. పోలీస్, రవాణా శాఖ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ వంటి శాఖల సోదాల ద్వారా డబ్బు, బంగారం, మద్యం, ఇతర సామాగ్రి పట్టుబడుతున్నాయి.
ఇప్పటివరకూ..
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్ల దగ్గర ఇటీవల పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు కారులో తరలిస్తోన్న రూ.3 కోట్లను సీజ్ చేశారు. ఇది హవాలా సొమ్ముగా గుర్తించారు. అలాగే కొండమల్లేపల్లి పీఎస్ వద్ద చెక్ పాయింట్ లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తోన్న రూ.1.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.5 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బు, బంగారాన్ని సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్లకూడాదని స్పష్టం చేశారు. రూ.50 వేలకు మించి నగదు ఉంటే కచ్చితంగా సంబంధిత పత్రాలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు. కాగా, రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదును తీసుకెళితే.. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Election Code

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News