Friday, May 17, 2024

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్ర: మోడీ

- Advertisement -
- Advertisement -

బాగల్‌కోట్(కర్నాటక): ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకురావాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను బిజెపి జరగనివ్వబోదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి వర్గాలు ఇప్పుడు బిజెపి పక్షాన నిలవడంతో మైనారిటీలను బుజ్జగించడానికి కాంగ్రెస్ ఈ ప్రతిపాదన చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి ఎస్‌సి, ఎస్‌టి, ఓబిల హుక్కులను కాలరాయడానికి కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించిందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. అయితే ఓబిసి రిజర్వేషన్లలో కొంత భాగాన్ని ముస్లింలకు కర్నాటక ప్రభుత్వం ఇచ్చివేసిందని ఆయన అన్నారు.

వారు ఇక్కడితో ఆగరని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి ఒక చట్టాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ గతంలో కూడా మేనిఫెస్టోలో పేర్కొందని ఆయన అన్నారు. కాంగ్రెస్ దురుద్దేశాలు అర్థం చేసుకోవలసిందిగా ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి సోదరులు, సోదరీమణులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. మత ప్రాతికన తమ ఓటు బ్యాంకును సురక్షితంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, బాబాజాహెబ్ అంబేద్కరా, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కులను లూటీ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి ఎంపీలలో అథ్యధికులు బిజెపి పార్టీకి చెందినవరేనని, ఈ కారణంగానే మైనారిటీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల నుంచి లూటీ చేసి మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ఆయన ఆరోపించారు. దీనికి మీరు అనుమతిస్తారా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. మీ హక్కులు, రిజర్వేషన్లను కాపాడేందుకు తాను ఎంత దూరమైనా వెళతానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు బిఎస్ ఎడియూరప్ప, బాగల్‌కోల్, విజయ్‌పురా ఎంపీలు పిసి గడ్డిగైడర్, రమేష్ జిగాజీనాగి కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News