హైదరాబాద్ : ఘనవ్యర్థాల నిర్వహణ, నియమాల అమలు, బయో మెడికల్ వేస్ట్, నది ప్రవాహాల్లో కాలుష్యం, ఎస్టీపీల నిర్మాణం, వ్యర్థజలాల శుద్ధీకరణ తదితర ఆంశాలపై ఎన్జీటీకి (National Green Tribunal)కు సమర్పించవలసిన నివేదికను జనవరి 31వ తేదీ నాటికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం బిఆర్కెఆర్ భవన్లో ఎన్జీటీ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై సిఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ మాట్లాడుతూ.. ఎన్జీటీకి సమర్పించవలసిన నివేదికలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని పొందుపరుచాలన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం టైంబాండ్ యాక్షన్ ప్లాన్ (time bound action plan) అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్యక్రమాలు, చెత్త సేకరణ తీరును ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వివరించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెట్రో వాటర్ వర్క్స ఎండి దానకిషోర్, పిసిబి సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్ , టిఎస్ఐఐసి ఎండి వెంకట నర్సింహా రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.