హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే చలి మొదలవుతోంది. రాత్రి సమయానికి చలి తీవ్రత అధికమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ తరువాత ఉమ్మడి నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్లోనే రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయని, చలిగాలుల తీవ్రత ఈ రెండు చోట్ల ప్రస్తుతం అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం సమయంలో చలిగాలుల తీవ్రతను తట్టుకునేలా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్లో సోమవారం రాత్రి 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం 12.6 డిగ్రీలు, శుక్రవారానికి 10.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది.
నాలుగు రోజుల్లోనే దాదాపుగా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా తరువాత హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రాత్రి హైదరాబాద్లో 15.3, శుక్రవారం 14, నిజామాబాద్లో 12, సంగారెడ్డిలో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 3.6 డిగ్రీలు తగ్గి స్థిరంగా కొనసాగింది. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలిగాలుల తీవ్రత అధికం అవుతోంది. పగలు సాధారణ స్థాయికంటే 1.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే ఎండతీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.