శాంసంగ్, షియోమిలకు ఆఫ్లైన్ రిటైలర్ల హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలయిన షియోమి, శాంసంగ్లకు దేశవ్యాప్తంగా ఉన్న 20 వేలకు పైగా ఉన్న ఆఫ్లైన్ రిటైలర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్లో ఆయా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు ఇస్తున్న భారీ డిస్కౌంట్లను నిలిపివేయాలని, లేదంటే ఆ కంపెనీలకు చెందిన ఫోన్లను ఆఫ్లైన్లో విక్రయించడాన్ని దేశవ్యాప్తంగా నిలిపివేస్తామని రిటైలర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఎఐఎంఆర్ఎ) ఆయా మొబైల్ కంపెనీలకు తాజాగా లేఖలు రాసింది.
శాంసంగ్, షియోమి కంపెనీలు ముందుగా ఆన్లైన్లో తమ కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ , ఆ తర్వాత 15, 20 రోజులకు ఆఫ్లైన్లో ఆ ఫోన్లను విక్రయిస్తున్నాయని, దీనివల్ల వినియోగదారులు సహజంగానే ఆ ఫోన్ల పట్ల ఆసక్తి చూపించడం లేదని, అదే కాకుండా ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లో తక్కువ ధరలకు లభిస్తుండడం, పండుగ సీజన్లు, ఇతర సమయాల్లో నిర్వహించే ప్రత్యేక సేల్స్లో భారీ తగ్గింపు ధరలకు విక్రయిస్తుండడం వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని ఎఐఎంఆర్ఎ తన లేఖల్లో స్పష్టం చేసింది. మొబైల్ తయారీ కంపెనీలు తమ ఫోన్లపై అందించే భారీ తగ్గింపు ధరలను నిలిపి వేయాలని, అలాగే ఆన్లైన్లో ఉన్న ధరలకే ఆఫ్లైన్లోనూ ఫోన్లను విక్రయించాలని కోరింది. అలా చేయని పక్షంలో ఆయా కంపెనీల ఫోన్లను ఆఫ్లైన్లో విక్రయించకుండా ఫోన్లను బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయితే ఈ విషయంపై కంపెనీలు ఇంకా స్పందించలేదు.
Offline traders warn of Xiaomi And Samsung