నిర్మల్ ః నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు బలగాలు పహారా కాస్తుండటంతో పాటు కర్ఫ్యూ విధించారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. తమ ఆదేశాలు ధిక్కరించి ఎవరు బయట తిరిగినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు 2 బెటాలియన్ల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సిబ్బందిని నిర్మల్ జిల్లాకు తరలించారు.
భైంసాలో మతపరమైన హింస జరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పట్టణంలో రెండు వర్గాల ప్రజలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో నిర్మల్ ఎస్పి శశిదాహర్ రాజు, డిఎస్పి నర్సింగ్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రావు ఉన్నారు. కాగా, తెలంగాణలో కర్ఫ్యూ విధించడం ఇదే తొలిసారి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఆరేళ్ల కాలంలో రాష్ట్రంలో కర్ఫ్యూ విధించేందుకు ఎలాంటి సందర్భాలు తలెత్తలేదు. ఇదే విషయాన్ని ఈ మధ్యే హోంమంత్రి మహమూద్ ఆలీ కూడా స్పష్టం చేశారు.
నివేదిక కోరిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ ః
బైంసా పట్టణంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ఖమ్రుద్దీన్ నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి, ఎస్పి రాజులను ఆదేశించారు. భైంసాలో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపధ్యంలో మంగళవారం కలెక్టర్, ఎస్పిలతో మైనారిటీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమ్రుద్దీన్ ఫోన్లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే వ్యక్తులు, శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.గత రెండు రోజులు జరిగిన పరిణామాలపై ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు.