హైదరాబాద్ : రెండు ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు -వినూత్న ముగ్గుకు సిరిసిల్లా జిల్లా వేదికైంది. సుమారు 200మంది టిఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్తలు పార్టీపై ఉన్న అభిమానంతో ఇలా ముగ్గును వేశారు. ఇది సిరిసిల్లా పట్టణ వాసులను విశేషంగా ఆకర్శిస్తోంది. దీనిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్ లో రెండెకరాల స్థలంలో సుమారు 200 మంది మహిళ టిఆర్ఎస్ కార్యకర్తలు సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తు ముగ్గును వేసి తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.
కారు గుర్తు ముగ్గును వీక్షించడానికి పట్టణవాసులు తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేసి అబ్బుర పరిచారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గంలో ఈ ముగ్గును వేసి మహిళా కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు మహిళా కార్యకర్తలను మంత్రి కెటిఆర్తో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులు అభినందించారు.