హైదరాబాద్ ః కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ప్రణాళికను న్యాయస్థానానికి గురువారం సమర్పించాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ధర్మాసనం సూచించింది.
మురికివాడలు, పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, గురువారం నుంచి హైకోర్టుకి వచ్చే వాళ్లందరకూ మాస్కులు ఇవ్వాలని ఆదేశించింది. కక్షిదారులను కోర్టులకు రావొద్దని వారికి సంబంధించిన లాయర్లు చెప్పాలని, విచారణ ఖైదీలను జైలు సిబ్బంది కనుక హాజరుపరచలేకపోతే వారిని మెజిస్ట్రేట్లు శిక్షించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. సభలు, సమవేశాల అనుమతిపై పోలీసులు సమీక్షించాలని సూచించింది.
హోలీ సంబరాలపై ః
కోవిడ్ 19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో బుధవారం నాడు మరో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు హైకోర్టుని ఆశ్రయించారు.ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీసంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హోలీ వేడుకలని నిషేధించాలని రిట్ పిటిషన్లో కోరారు. హోలీ వేడుకలను నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్కు గురికాకుండా కాపాడవచ్చని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.