హైదరాబాద్: రజకులను ఎస్సి జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ రజక సంఘాల సమితి ప్రతినిధులు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. రజకులను ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. రజకులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు పెన్షన్ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం రజకులకు న్యాయం చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్కు కూడా ఎస్సి జాబితాలో చేర్చాలని తెలంగాణ రజక సంఘాల సమితి ప్రతినిధులు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.
దేశంలోని 18 రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సి జాబితాలో కొనసాగుతున్నారని వారు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన రజకులకు ఎస్సి జాబితాలోకి చేర్చాలని కోరారు. ప్రస్తుత బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. కెటిఆర్, వినోద్ను కలిసిన వారిలో తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్, ముస్తాబాద్ మండల పరిషత్ అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, రాష్ట్ర కో కన్వీనర్లు మానసా గణేష్, కొండూరు సత్యనారాయణ, కుమార స్వామి, సంపత్, పురుషోత్తం, కోట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.