మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదుల ఉపరితలం నుంచి సరఫరా చేసి అన్ని స్థాయిలలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి అందించే మిషన్ భగీరథ నీళ్ళు ప్రజలకు వరప్రదాయినిగా మారిందని నిపుణుల సంఘం అభిప్రాయపడింది. వరంగల్ ఎన్ఐటి రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు ఆధ్వర్యంలోని నిపుణులు, ఇంజనీర్లు పలు జిల్లాల్లో మిషన్ భగీరథ, మినరల్ వాటర్ ఆర్ఒ నీళ్లను పరీక్షించారు.
మినరల్ వాటర్ – ఆర్ఒ నీళ్లు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని తేల్చారు. మినరల్ వాటర్ ఆర్ఒ నీళ్లలో 100 పిపిఎం లోపు మినరల్స్ ఉండగా, మిషన్ భగీరథ నీళ్లలో 300 నుంచి 400 పిపిఎం మినరల్స్ ఉన్నట్లు స్పష్టం అయినట్లు వారు నివేదిక సిద్ధం చేశారు. బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ను బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో కలిసి రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు ఈ నివేదికను అందజేసి వివరాలను వెల్లడించారు.
మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే నీళ్లలో మనిషికి అవసరమైన మినరల్స్, క్యాల్షియం, మ్యాగ్నీషియం, పుష్కలంగా లభిస్తాయని పాండురంగారావు తెలిపారు. భగీరథ నీళ్లు తాగడం వల్ల జబ్బులు రావని, ఆరోగ్యంగా ఉంటారని పరీక్షల్లో తేలినట్లు ఆయన వినోద్ కుమార్కు వివరించారు. మిషన్ భగీరథ నీళ్లు ఆరోగ్యకరమైనవని అన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఒ) కూడా నివేదిక విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోషల్ స్టేటస్గా భావిస్తూ మినరల్ వాటర్ – ఆర్ఒ ( రివర్స్ ఒస్మోసిస్ ) నీళ్లు తాగుతూ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పాండురంగారావు పేర్కొన్నారు.
మినరల్ వాటర్ – ఆర్ఒ నీళ్లను శుద్ధి చేయడం వల్ల మినరల్స్ దాదాపుగా వెళ్లి పోతున్నాయని అన్నారు. మనిషికి అవసరమైన మినరల్స్ మిషన్ భగీరథ నీళ్లలో పుష్కలంగా ఉండటం వల్ల ఆ నీళ్లు తాగిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. మినరల్ వాటర్ – ఆర్ఒ నీళ్లు వాడటం వల్ల ఎముకలు మెత్త బడటం, కీళ్ల నొప్పులు, బోన్ లాస్, హెయిర్ లాస్ వంటి జబ్బులు రావడం, డిప్రెషన్ కు లోను కావడం జరుగుతుందని ఆయన వినోద్ కుమార్ కు వివరించారు.